వైజాగ్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్లో తొలి టెస్టు ప్రారంభమయింది. సాగరతీరం విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. టెస్టులలో తొలిసారి ఓపెనర్గా దిగిన 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. 84 బంతుల్లో 5 ఫోరులు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ పరుగులు చేసాడు. హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్.. టెస్ట్ ఓపెనర్గా సక్సెస్ అయినట్టే అని అందరూ అభిప్రాయపడుతున్నారు.
యాజమాన్యంతో తుది చర్చలు.. కోచ్గా అనిల్ కుంబ్లే?!!
టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సన్నాహక మ్యాచ్లో పరుగులేమీ సాధించకుండా ఔటైన రోహిత్ తొలి ఇన్నింగ్స్లో ఎలా ఆడతాడోనని అంతా ఆందోళన చెందారు. కానీ ఆరంభంలో ఆచితూచి ఆడిన రోహిత్.. అనంతరం తనదైన శైలిలో రెచ్చిపోయాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్తో సమన్వయం చేసుకొంటూ చక్కని భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలోనే అగర్వాల్ (39; 96 బంతుల్లో 6x4, 1x6)తో కలిసి టీమిండియాకు మంచి శుభారంభం ఇచ్చాడు.
రోహిత్ బౌండరీలు, సింగిల్స్ తీస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టెస్టుల్లో ఓపెనర్గా వచ్చిన తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఓపెనర్లు రాణించడంతో లంచ్ విరామం వరకు టీమిండియా 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ (52), మయాంక్ అగర్వాల్ (39) క్రీజులో ఉన్నారు. ఇక ప్రొటీస్ బౌలర్లు వికెట్ తీయడానికి కష్టాలు పడుతున్నారు. ఓపెనర్లు ఇలాగే చెలరేగితే టీమిండియా భారీ స్కోర్ సాధించడం ఖాయం.
టెస్ట్ మ్యాచ్కు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. తెలుగు తేజం హనుమ విహారి సొంత అభిమానుల మధ్య ఆడనున్నాడు. దీంతో అతనిపై కూడా విశాఖ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. టెస్ట్ చాంపియన్షిప్లో ఇప్పటికే 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ బలమైన బ్యాటింగ్ లైనప్కు తోడు సొంతగడ్డ అనుకూలతతో విజయం సాధించాలని చూస్తోంది.
🙌🙌@ImRo45 #INDvSA pic.twitter.com/BsqCeWdTQm
— BCCI (@BCCI) October 2, 2019