
ధోనీ రియల్ ప్రాంక్స్టర్:
చాహల్ మాట్లాడుతూ... 'జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కొత్త ఆటగాళ్లను ఇతరులుగా భావించలేదు. అందరూ బాగా ఉంటారు. ఎవరితోనైనా, ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. ధోనీతో కలిసి పబ్జీ ఆడుతున్నా లేదా మాట్లాడుతున్నా.. మహీభాయ్ లాంటి ఆటగాడితో ఉన్నామనే భావనే రాదు. ధోనీ రియల్ ప్రాంక్స్టర్. రోహిత్ శర్మ కూడా అలాగే ఉంటాడు' అని తెలిపాడు.

విరాట్ భాయ్ సైలెంట్ కిల్లర్:
'విరాట్ భాయ్ సైలెంట్ కిల్లర్. జట్టులోని ఇతరులను ఆటపట్టిస్తుంటే మధ్యలో దూరి ఆడుకుంటాడు. డ్రెస్సింగ్ రూమ్లో చిలిపిగా ఉంటాడు. అందరం పాటలు వింటూ సరదాగా గడుపుతాం. కోహ్లీ, ధావన్ పంజాబీ పాటలు ఎక్కువగా వింటారు. కోహ్లీ టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్పై శ్రద్ధపెట్టాడు. ఆటగాళ్లంతా జిమ్కెళ్లి కష్టపడుతున్నారు. కోహ్లీ గంటల పాటు షూటింగ్లో పాల్గొన్నా.. రోజూ కచ్చితంగా వ్యాయామం చేస్తాడు. ఫిట్నెస్పై కోహ్లీకి అంత నిబ్బద్ధత ఉంది' అని చాహల్ పేర్కొన్నాడు.

కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించా:
'నాకు తొలి ప్రపంచకప్. మహీ భాయ్ ఔటై పెవిలియన్కు చేరే క్రమంలో నేను బ్యాటింగ్కు వెళ్తున్నా. ఆ సమయంలో నా కళ్ల వెంట వస్తోన్న కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించా. అది నన్ను చాలా నిరుత్సాహపరిచింది. టోర్నీలో వరుసగా 9 మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడి ఆఖర్లో నిష్క్రమించాం. వర్షం మన చేతుల్లో లేదు కాబట్టి ఏమీ చెప్పడం సరైనది కాదు. మైదానం నుంచి వీలైనంత త్వరగా తిరిగి హోటల్కు తిరిగి వెళ్లాలని మేము కోరుకోవడం ఇదే మొదటిసారి. నేను 5-6 సంవత్సరాలు ఆటను కొనసాగించాలనుకుంటున్నా. కనీసం ఒక ప్రపంచకప్ గెలవాలనుకుంటున్నా' అని చాహల్ చెప్పుకొచ్చాడు.

టీ20 సిరీస్లకు దూరం:
ప్రపంచకప్ తర్వాత చాహల్ వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టీ20 సిరీస్లకు దూరమయ్యాడు. చాహల్, కుల్దీప్ స్థానాల్లో జట్టు యాజమాన్యం కొత్త వారికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యా జట్టులోకి వచ్చారు. అయితే అతడిని జట్టులోకి తీసుకోవాలని మాజీ కెప్టెన్ సౌరభ్గంగూలీ అంటున్నాడు.


Click it and Unblock the Notifications












