విశాఖ: విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ నిర్దేశించిన 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఎదురీదుతోంది. ఇప్పటికే ఎనమిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది. ఆదివారం చివరిరోజు దక్షిణాఫ్రికా 59 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ రవీంద్ర జడేజా పోటీపడి వికెట్లు తీయడంతో భారత్ విజయానికి చేరువన నిలిచింది. భారత్ విజయానికి కేవలం రెండు వికెట్ల దూరంలో మాత్రమే ఉంది. భారత్ విజయాన్ని వరణుడు తప్ప.. ఎవరూ అడ్డుకునే అవకాశం లేదు. చివరి రోజు లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది.
PAK vs SL: రెండో టీ20లోనే హ్యాట్రిక్.. పాకిస్థాన్ బౌలర్ ప్రపంచ రికార్డు!!
ఆదివారం 11/1 ఓవర్నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్లోనే డిబ్రుయిన్ (10)ను స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌల్డ్ చేసాడు. ఇక ఆ తర్వాతి ఓవర్లో పేసర్ మహ్మద్ షమీ ..తెంబ బువుమా (0)ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం మరింత రెచ్చిపోయిన షమీ.. 40 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను తీసి దక్షిణాఫ్రికా టాపార్డర్ వెన్నువిరిచాడు. డుప్లెసిస్ (13), డీకాక్ (0)లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక రవీంద్ర జడేజా షమీకి తోడవ్వడంతో దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది. 10 పరుగుల వ్యవధిలో ఓపెనర్ మార్కరమ్ (39),ఫిలిండర్ (0, మహరాజ్ (0)లను జడేజా బోల్తా కొట్టించాడు. దీంతో సఫారీలు ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అయితే సేనురాన్ ముత్తుసామి, డేన్ పీడ్ట్ ఆదుకునే ప్రయత్నం చేస్తునారు. ఈ జోడి ఇప్పటికే ధాటిగా ఆడుతూ 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈజోడిని విడదీసేందుకు భారత బౌలర్లు కష్టపడుతున్నారు.
లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 42 ఓవర్లకు 117 పరుగులు చేసి ఎనమిది వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం సేనురాన్ ముత్తుసామి (19), డేన్ పీడ్ట్ (32) బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా విజయానికి ఇక 2 వికెట్లే. ఇంకా దక్షిణాఫ్రికా 278 పరుగుల వెనుకబడి ఉండటంతో భారత్ విజయం లాంఛనమే. అంతకముందు దక్షిణాఫ్రికాకు టీమిండియా 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ (127: 149 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. పుజారా (81: 148 బంతుల్లో 13ఫోర్తు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.