
విశాఖ: సాగరతీరం విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (100; 204 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేసాడు. మయాంక్కు ఇది కెరీర్లో తొలి సెంచరీ. దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మయాంక్ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగి సెంచరీ పూర్తి చేసాడు. సెంచరీ పూర్తి కాగానే మయాంక్ గాల్లోకిఎగురుతూ సంబరాలు చేసుకున్నాడు. ఆపై మరో ఓపెనర్ రోహిత్ శర్మ అతన్ని అభినందించాడు. ఇక డ్రెస్సింగ్ రూంలో ఉన్న జట్టు సభ్యులు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు.
తొలి రోజు కూడా మయాంక్ అగర్వాల్ అద్భుతంగా ఆడాడు. రోహిత్ శర్మకు చక్కటి సహకారం అందిస్తూ భారత్ భారీ స్కోర్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. విదేశాల్లో, స్వదేశంలో తొలి ఇన్నింగ్స్లో 50+ స్కోరు చేసిన ఆటగాడిగా మయాంక్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రోహిత్-మయాంక్ అరుదైన రికార్డు సాధించారు. దక్షిణాఫ్రికాపై తొలి వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడీగా రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు సెహ్వాగ్-గంభీర్ (218) పేరిట ఉండేది.
రెండో రోజు ఓపెనర్ల ఆటతో విశాఖ స్టేడియం హోరెత్తుతోంది. అభిమానులు కేరింతలతో స్టేడియం మొత్తం సందడిగా మారింది. తొలిరోజే రోహిత్ శర్మ (100; 154 బంతుల్లో, 10x4, 4x6) కూడా సెంచరీ చేసాడు. టెస్టుల్లో ఓపెనర్గా ఆడుతున్న తొలి మ్యాచ్లోనే రోహిత్ సెంచరీ చేయడం విశేషం. రెండో రోజు 202/0తో ఆటను ప్రారంభించిన భారత్ ప్రస్తుతం వికెట్ నష్టపోకుండా 306 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ (166), మయాంక్ అగర్వాల్ (136) క్రీజులో ఉన్నారు.
తొలి రోజు ఆటలో మేఘాలు కమ్ముకొని ఉరుములు రావడంతో అరగంట ముందే టీ విరామం ఇచ్చారు. తర్వాత వరుణుడు తన ప్రతాపం చూపించడంతో మ్యాచ్ను నిలిపేశారు. అయితే రెండో రోజు కూడా వరుణుడు తన పంజా విసిరే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు కూడా 60 శాతం వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. అయితే తొలి రోజు కంటే తక్కువ వర్షం పడుతుందట. వర్షం కారణంగా మ్యాచ్ ఎప్పుడైనా ఆగిపోయే అవకాశం ఉంది.