
దక్షిణాఫ్రికాతో..
ఈ నెల 23వ తేదీన ఓపెనర్లో భారత జట్టు పాకిస్తాన్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. అనంతరం నెదర్లాండ్స్పైనా తన దండయాత్రను కొనసాగించింది. రెండు మ్యాచ్లు- రెండు విజయాలతో నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది భారత్. నెట్ రన్రేట్ కూడా మెరుగుపడింది. 1.425గా రికార్డయింది. దీని తరువాత తన తదుపరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. ఆదివారం ఈ మ్యాచ్ పెర్త్లో షెడ్యూల్ అయింది. సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ఫుల్ జోష్లో..
పాకిస్తాన్, నెదర్లాండ్స్పై సాధించిన విజయాలతో టీమిండియా క్యాంప్లో ఫుల్ జోష్ నింపింది. యుద్ధానికి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నట్టుగా ఉన్నారు ప్లేయర్లు. ఎలాంటి ప్రత్యర్థినయినా మట్టి కరిపించేలా కనిపిస్తోన్నారు. పాకిస్తాన్పై చివరి బంతి వరకూ మడమ తిప్పకుండా పోరాడింది భారత్. నెదర్లాండ్స్పై వార్ను వన్ సైడ్ చేసింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలుత బ్యాట్తో, ఆ తరువాత బంతితో రాణించింది.

కేఎల్ రాహుల్ ఫెయిల్యూర్..
జట్టు మొత్తం ఒక ఎత్తయితే- ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుస వైఫల్యాలు మరో ఎత్తుగా మారాయి. అతను ఫామ్ను కోల్పోవడం టీమిండియా ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నట్టవుతోంది. టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లల్లోనూ కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలం అయ్యాడు. పాకిస్తాన్పై అతను చేసింది నాలుగు పరుగులే. ఎనిమిది బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి నసీం షా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు.

రివ్యూ కూడా కోరకుండా..
అదే వైఫల్యం నెదర్లాండ్స్ మీద కూడా కొనసాగింది. ఈ మ్యాచ్లో తొమ్మిది పరుగులు చేసి వెనుదిరిగాడు. అతను అవుట్ అయిన తీరు కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వాన్ మీకెరెన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. రివ్యూ తీసుకుని ఉంటే ఖచ్చితంగా అది నాటౌట్ అని తేలి ఉండేది. బంతి లెగ్ స్టంప్కు కాస్త దూరంగా వెళ్తోందనేది రివ్యూలో స్పష్టంగా కనిపించింది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న కేప్టెన్ రోహిత్ శర్మ సూచిస్తోన్నప్పటికీ.. రివ్యూను తీసుకోకుండా పెవిలియన్కు వెళ్లిపోయాడు కేఎల్ రాహుల్.

మెంటల్ కండిషన్పై సెషన్..
ఈ పరిణామాల మధ్య అతను తన తదుపరి మ్యాచ్ను దక్షిణాఫ్రికాపై ఆడాల్సి ఉంది. తన వైఫల్యాన్ని ఈ మ్యాచ్లో కూడా కొనసాగిస్తే- జట్టులో అతని చోటు ఉంటుందా? ఊడుతుందా? అనే ప్రశ్నలు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో కీలక నిర్ణయం తీసుకుంది టీమ్ మేనేజ్మెంట్. మెంటల్ కండిషన్ స్పెషల్ కోచ్ ప్యాడీ అప్టాన్తో ట్రైనింగ్ ఇప్పించనుంది. కేఎల్ రాహుల్ ఇవ్వాళే ప్యాడీ అప్టాన్ను కలుసుకునే అవకాశం ఉంది. రెండు గంటల పాటు ఈ మెంటల్ కండీషన్ సెషన్ ఉంటుందని చెబుతున్నారు.

అంతకుముందు కోహ్లీకీ..
టెక్నికల్గా కేఎల్ రాహుల్లో ఎలాంటి లోపాలు లేనప్పటికీ- మానసికంగా బలహీన పడి ఉండొచ్చని, ఒత్తిళ్లతో సతమతమౌతున్నాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ స్పెషల్ సెషన్లో అతని ఆటతీరు మళ్లీ గాడినపడుతుందని ఆశిస్తోంది. ప్యాడీ అప్టాన్ ఇదివరకు విరాట్ కోహ్లీకి ఇదే రకమైన సెషన్ తీసుకున్నాడు. ఆసియా కప్ 2022 టోర్నమెంట్కు ముందు అతణ్ని కన్సల్ట్ అయ్యాడు కోహ్లీ. ఆ తరువాత ఏ స్థాయిలో ఏ స్థాయిలో విజృంభిస్తోన్నాడనేది తెలిసిన విషయమే.


Click it and Unblock the Notifications












