కేప్టౌన్లో వికెట్ల మోత మోగింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆటలో ఏకంగా 23 వికెట్లు పడ్డాయి. టెస్టులో తొలి రోజు 23 వికెట్లు పడటం 122 ఏళ్లలో ఇదే తొలిసారి. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా సిరాజ్ (6/15) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌటైంది. 153/4తో మెరుగైన స్థితిలోనే ఉన్న టీమిండియా అనూహ్యంగా 153 పరుగులకే ఆలౌటైంది. టాప్ స్కోరర్గా విరాట్ కోహ్లి (46) నిలిచాడు.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసేసరికి 62 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ కంటే 36 పరుగుల వెనుకంజలో సౌతాఫ్రికా ఉంది. క్రీజులో మార్క్రమ్ (36), బెండింగ్హమ్ (7) ఉన్నారు. ముకేశ్ కుమార్ రెండు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు.

అయితే భారత్ బౌలర్ల సంచలన ప్రదర్శనను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. టీమిండియా పేసర్లు ఈ స్థాయిలో సత్తాచాటడానికి కారణం కపిల్ దేవ్ అని పేర్కొన్నాడు. ''కపిల్ దేవ్కు థ్యాంక్స్ చెప్పాలి. భారత్లో స్పిన్ బౌలర్లే ఉండాలనే ఆలోచనను కపిల్ మార్చాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కొత్త బంతితో చెలరేగే బౌలర్లకు అతడు మార్గనిర్దేశకంగా నిలిచాడు. ఫాస్ట్ బౌలర్లను ప్రోత్సహించాడు''
''అంతేగాక గత 10-12 ఏళ్లలో ఎంతో మంది భారత్ పేసర్లు వెలుగులోకి వచ్చారు. దానికి కారణమైన ఐపీఎల్కు కూడా థ్యాంక్స్ చెప్పాలి. క్రికెట్ ప్రపంచం అసూయ పడేలా మన దగ్గర ఫాస్ట్ బౌలర్ల బెంచ్ సామర్థ్యం ఉంది. లెఫ్ట్, రైడ్ హ్యాండర్స్తో ఎంతో మంది నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. బుమ్రా అందుబాటులో లేనప్పుడు బెంచ్ సామర్థ్యంతోనే అద్భుతాలు సృష్టించాం. ఈ విజయాలన్నీ కపిల్ దేవ్కు అంకితం చేయాలి. అలాగే కపిల్ బర్త్డే అయిన జనవరి 6వ తేదీ రోజు భారత్ రెండో టెస్టులో విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నా'' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.