దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో యువ భారత్ జట్టు సత్తాచాటుతోంది. వరుస విజయాలతో టీమిండియా అండర్-19 జట్టు హోరెత్తిస్తుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికాను ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. విజయంలో సిరిసిల్ల కుర్రాడు అరవల్లీ అవనీశ్ రావ్ (60*; 56 బంతుల్లో) కీలక పాత్ర పోషించాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 46.1 ఓవర్లుకు 240 పరుగులకు ఆలౌటైంది. అయితే దక్షిణాఫ్రికాకు గొప్ప ఆరంభం లభించింది. ఓపెనర్లు ప్రిటోరియస్ (67; 61 బంతుల్లో ), స్టీవ్ స్టోక్ (46; 27 బంతుల్లో) తొలి వికెట్కు పది ఓవర్లలోపే 93 పరుగులు జోడించారు. వారి జోరును చూస్తూ సఫారీలు భారీ స్కోరు సాధించేలా కనిపించింది.

కానీ భారత్ బౌలర్ల తర్వాత పుంజుకుని గొప్పగా దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును కోలుకోనివ్వలేదు. టీమిండియా బౌలర్లలో ఆరాధ్య శుక్లా నాలుగు వికెట్లు సాధించగా, సౌమీ పాండే మూడు వికెట్లు, అర్షిన్ కులకర్ణి రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన భారత్ 40.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ (66; 70 బంతుల్లో), అర్షిని కులకర్ణి (91; 106 బంతుల్లో) అదరగొట్టారు. వీరిద్దరు సంయమనంతో ఆడుతూ మొదటి వికెట్కు 117 పరుగులు జోడించారు. అయితే జేమ్స్ బౌలింగ్లో ఆదర్శ్ స్టంపౌట్గా వెనుదిరిగాడు. వన్డౌన్లో వచ్చిన అరవల్లీ అవనీశ్ (60*) కులకర్ణితో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. శతకానికి చేరవవుతున్న కులకర్ణితో పాటు సచిన్ దాస్ (0) స్వల్ప వ్యవధిలోనే ఔటైనా.. అవనీశ్ జట్టును గెలిపించాడు.
యువ వికెట్కీపర్ అవనీశ్ రావ్ తెలంగాణలోని సిరిసిల్ల నియోజకవర్గంలోని పోత్గల్ గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్తో పాటు అండర్-19 ప్రపంచకప్ కూడా అవనీశ్ ఎంపికయ్యాడు. అవనీశ్తో పాటు హైదరాబాద్కు చెందిన మురుగన్ అభిషేక్ కూడా సెలక్ట్ అయ్యాడు. జనవరి 19 నుంచి ప్రారంభం కానున్న అండర్-19 వరల్డ్ కప్నకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తుంది. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో అవనీవ్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు దక్కించుకున్న విషయం తెలిసిందే.