విశాఖ: మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు చివరి రోజు ఉదయం భారత బౌలర్లు హవా కొనసాగింది. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్లోనే డిబ్రుయిన్ (10)ను స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌల్డ్ చేసాడు. ఇక ఆ తర్వాతి ఓవర్లో పేసర్ మహ్మద్ షమీ ..తెంబ బువుమా (0)ను పరుగులు ఏమీ చేయకుండానే పెవిలియన్ చేర్చాడు. బవుమా ఎదుర్కొన్న రెండో బంతికే బౌల్డ్గా వెనుదిరిగాడు. ఆట ఆరంభంలోనే కీలక రెండు వికెట్లు కోల్పోవడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది.
ఐదో రోజు ఓవర్ నైట్ స్కోర్ 11/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఎదురీదుతోంది. మార్క్రమ్, కెప్టెన్ డుప్లెసిస్ ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతున్నారు. అయితే కెప్టెన్ కోహ్లీ ఓ ఎండ్ నుంచి పేస్.. మరో ఎండ్ నుండి స్పిన్ను వేయిస్తున్నాడు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లకు 48 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం మార్క్రమ్ (26), డుప్లెసిస్ (9) బ్యాటింగ్ చేస్తున్నారు. తాజా వికెట్తో అశ్విన్ టెస్టుల్లో 350 వికెట్లు తీశాడు. టీమిండియా గెలవడానికి ఇంకా ఏడు వికెట్ల దూరంలో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 347 కావాలి.
నాలుగో రోజు చివరలో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే రవీంద్ర జడేజా షాకిచ్చాడు. దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 4 పరుగుల వద్ద ఓపెనర్ ఓపెనర్ డీన్ ఎల్గర్ (4) రవీంద్ర జడేజా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకముందు దక్షిణాఫ్రికాకు టీమిండియా 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ (127: 149 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. పుజారా (81: 148 బంతుల్లో 13ఫోర్తు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.
రవీంద్ర జడేజా(40: 32 బంతుల్లో 3సిక్సర్లు), రహానే (27 నాటౌట్: 17 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడారు. జడేజా, రహానే సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ వన్డే తరహాలో భారీ షాట్లతో చెలరేగారు. ఇక ఆధిక్యం 390 దాటగానే రెండో ఇన్నింగ్స్ను విరాట్ కోహ్లీ డిక్లేర్ చేశాడు. టీమిండియా 67 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 323 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది.