అభిమాని అత్యుత్సాహం:
ప్రస్తుతం మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా పుణె వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టులో మూడో రోజైన శనివారం ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. లంచ్ విరామం అనంతరం భారత ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చారు. కొద్ది సమయానికే తమ అభిమాన క్రికెటర్ అయిన రోహిత్ శర్మను కలిసేందుకు ఫెన్సింగ్ దాటి ఓ అభిమాని మైదానంలోకి దూసుకువచ్చాడు.
కిందపడ్డ రోహిత్:
అభిమాని మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ వద్దకు ఆ పరిగెత్తుకు వచ్చి అతడి పాదాలను ముద్దాడేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న రహానే వద్దు అని సూచించినా.. అభిమాని మాత్రం ఆగలేదు. అయితే ఈ ప్రయత్నంలో అదుపు తప్పిన రోహిత్ కిందపడ్డాడు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే పరిగెత్తుకొచ్చి అతడిని దూరంగా తీసుకెళ్లారు. ఇది చూసిన రహానే నవ్వుకున్నాడు.
ముద్దుపెట్టేందుకు ప్రయత్నం:
ఇలా అభిమానులు రోహిత్ కోసం మైదానంలోకి దూసుకురావడం ఇది మొదటిసారేం కాదు. గతంలో విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై-బీహార్ మధ్య జరిగిన మ్యాచ్లో మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని రోహిత్ను ముద్దుపెట్టేందుకు ప్రయత్నించాడు. గతేడాది హైదరాబాద్లోని ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీకి అభిమాని ముద్దిచ్చాడు. ఇక ధోనీ అభిమానులు అయితే చాలా సార్లే వచ్చి అతని పాదాలు తాకి వెళ్లారు. ఓసారి ధోనీ తన అభిమానిని సరదాగా మైదానంలో పరిగెత్తించాడు.