దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అయిదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా టార్గెట్ ను సౌతాఫ్రికాకు 15 ఓవర్లలో 152గా నిర్ణయించారు. ఆతిథ్య జట్టు 13.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు పేలవ ఆరంభం దక్కింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, గిల్ ఖాతా తెరవకముందే పెవిలియన్ కు చేరారు. జేన్సన్ బౌలింగ్ లో షాట్ కు యత్నించి జైశ్వాల్.. మిల్లర్ చేతికి చిక్కాడు. మరోవైపు గిల్ ను విలియమ్స్ వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే వికెట్లు కోల్పోయినా తిలక్ వర్మ (29), సూర్యకుమార్ యాదవ్ (56) ధాటిగానే ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో టీమిండియా పవర్ ప్లేలో 59 పరుగులు చేసింది. కానీ తిలక్ ను కొయొట్జీ ఔట్ చేసి దెబ్బ కొట్టాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రింకూ సింగ్ (68) తో కలిసి సూర్య స్కోరుబోర్డు నడిపించాడు. ఈ క్రమంలో అర్ధశతకం సాధించి షంసీ బౌలింగ్ లో ఔటయ్యాడు. సూర్య ఉన్నంతవరకు స్ట్రైక్ రొటేట్ చేసిన రింకూ సింగ్.. కెప్టెన్ ఔటైన తర్వాత బాదే బాధ్యతను అందుకున్నాడు. మరో ఎండ్ లో వికెట్లు పడుతున్నా బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 19.3 ఓవర్ల పాటు ఆట సాగిన తర్వాత వరుణుడు ఎంట్రీతో మ్యాచ్ ఆగింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు వచ్చింది.
ఛేదనలో దక్షిణాఫ్రికా ఆది నుంచే ఆధిపత్యం చెలాయించింది. ఓపెనర్లు హెండ్రిక్స్ (49), బ్రీట్జ్కే (16) తొలి రెండు ఓవర్లలోనే 38 పరుగులు సాధించారు. మూడో ఓవర్ లో బ్రీట్జ్కే రనౌటయ్యానా సౌతాఫ్రికా స్కోరు వేగం తగ్గలేదు. వన్ డౌన్ లో వచ్చిన మార్క్రమ్ (30)తో కలిసి హెండ్రిక్స్ బౌండరీల మోత మోగించాడు. అయితే టీమిండియా బౌలర్లు పుంజుకొని స్వల్పవ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో 108 పరుగులకే సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే అప్పటికే మ్యాచ్ లో పైచేయి సాధించిన దక్షిణాఫ్రికా మరో వికెట్ కోల్పోయి ఏడు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ముకేశ్ రెండు వికెట్లు, సిరాజ్, కుల్ దీప్ చెరో వికెట్ తీశారు.