
భారత పర్యటన అత్యంత సవాల్:
'భారత పర్యటన అత్యంత సవాల్తో కూడుకున్నది. భారత్లో పర్యటిస్తే ఒక క్రికెటర్గా మనమేంటో తెలుస్తుంది. ఇక్కడి హోటళ్లు అంతగా బాగాలేకపోయాయినా.. మైదానాలు మాత్రం సవాళ్లు విసురుతాయి. భారత్కు వస్తే నేర్చుకొనేందుకు ఎంతో ఆస్కారం ఉంటుంది. భారత బౌలింగ్, బ్యాటింగ్ అద్భుతం. మేము ఇంకా మెరుగవ్వాల్సి ఉంది' అని ఎల్గర్ అన్నారు.

ప్రతి మ్యాచ్ కోసం పోరాడాలి:
'గతంలో టెస్ట్ సిరీస్ కోల్పోతే.. చివరి టెస్టు నామమాత్రంగా ఆడేవారు. కానీ.. టెస్టు ఛాంపియన్షిప్లో ఇప్పుడు పాయింట్లు ఉన్నాయి. ప్రతి మ్యాచ్ కోసం పోరాడాల్సి ఉంటుంది. చివరి టెస్టులో టీమిండియాపై గెలిస్తే 40 పాయింట్లు లభించొచ్చు. అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తాం. జట్టుగా మంచి ప్రదర్శన చేస్తే విజయం సాధించవచ్చు. మేము రాణిస్తామనే నమ్మకం ఉంది' అని ఎల్గర్ పేర్కొన్నాడు.

మెరుగైన క్రికెట్ ఆడలేదు:
'ఈ సిరీస్లో మా జట్టు నిలకడగా ఆడలేదు. మెరుగైన క్రికెట్ ఎవరూ ఆడలేదు. ఆటగాళ్లలో ప్రేరణ నింపేందుకు సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎప్పటికీ గర్వకారణమే. మాకు మరో మ్యాచ్ మిగిలుంది. గెలిస్తే పరిస్థితిలో ఎంతో కొంత మార్పు తీసుకురావొచ్చు' అని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. తొమ్మిదేళ్ల తర్వాత ఉపఖండంలో శతకం బాదిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డు ఎల్గర్ సృష్టించిన విషయం తెలిసిందే.

ప్రాక్టీస్ సెషన్లో కసరత్తులు:
మూడు టెస్టుల సిరీస్లో దక్షిణాఫ్రికా 0-2తో వెనకబడ్డ సంగతి తెలిసిందే. ఫ్రీడమ్ సిరీస్లో భాగంగా శనివారం నుంచి చివరిదైన మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. రాంచీ వేదికగా ఆరంభమయ్యే చివరి టెస్టు కోసం ప్రొటీస్ ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు ప్రారంభించారు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో డుప్లెసిస్, బవుమా, డిబ్రుయన్, డికాక్, ముత్తుస్వామి పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications
