9ఏళ్ల తర్వాత భారత్లో శతకం:
34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన తన జట్టును ఎల్గర్ ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే మొదటగా హాఫ్ సెంచరీ, ఆపై సెంచరీ సాధించాడు. ఇది ఎల్గర్కు 12వ టెస్టు సెంచరీ. ఆసియా ఖండంలో రెండో సెంచరీ కాగా.. భారత్లో తొలి సెంచరీ. ఇక 2010 తర్వాత ఇండియా పిచ్లపై ఓ దక్షిణాఫ్రికా ఆటగాడు టెస్టుల్లో సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. 2010లో భారత్లో హషీమ్ ఆమ్లా టెస్టు సెంచరీ చేసాడు. మళ్లీ 9ఏళ్ల తర్వాత భారత్లో ఆ దేశ బ్యాట్స్మన్ శతకం నమోదు చేశాడు.
100 పరుగుల భాగస్వామ్యం:
దక్షిణాఫ్రికా 39/3తో మూడో రోజు ఆటను ప్రారంబించింది. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఎల్గర్, బవుమా నిలకడగా ఆడారు. అయితే 27వ ఓవర్ వేసిన ఇషాంత్ తొలి బంతికే బవుమాను పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 40వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్లో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ ఎల్గర్.. బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఎల్గర్ సెంచరీ:
అర్ధ సెంచరీ అనంతరం డుప్లెసిస్ (55; 103 బంతుల్లో 8×4, 1×6) ఔట్ అయ్యాడు. అనంతరం డికాక్ సహాయంతో ఎల్గర్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో ఫాలోఆన్ నుంచి తమ జట్టును రక్షించేందుకు ఎల్గర్ తన వంత ప్రయత్నం చేస్తున్నాడు. 75 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. క్రీజులో డికాక్ (38), ఎల్గర్ (116) ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇంకా టీమిండియా తొలి ఇన్నింగ్స్కు 259 పరుగులు వెనకబడి ఉంది. రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీసాడు. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ను 136 ఓవర్లకు గాను 502/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. రోహిత్ శర్మ (176, 244 బంతుల్లో; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ, మయాంక్ అగర్వాల్ (371 బంతుల్లో 215, 22 ఫోర్లు, 5 సిక్సులు) డబుల్ సెంచరీ చేశారు.