
విశాఖ: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ సాగరతీరం విశాఖలో జరగనుంది. నగరంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం నుంచి ఆరంభం కానున్న తొలి టెస్ట్ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశాఖకు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీతో పాటు స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా విశాఖ చేరుకున్నాడు. ఈ ఇద్దరితో పాటు మరికొందరు టీమిండియా ఆటగాళ్లు విశాఖలో అడుగుపెట్టారు. ముంబై నుంచి ఇండిగో విమానంలో ఆటగాళ్లు నేరుగా నగరానికి చేరుకన్నారు.
నగరానికి వచ్చిన టీమిండియా ఆటగాళ్లకు విశాఖ అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమాశ్రయంలో కోహ్లీ అభిమానులు అతడిని చూడటానికి ఎగబడ్డారు. గత వారమే దక్షిణాఫ్రికా జట్టు విశాఖకు చేరుకోగా.. భారత జట్టులోని సభ్యులు విడతల వారీగా నగరానికి చేరుకుంటున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం టీమిండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు గతవారమే ఇక్కడకు వచ్చారు.
అక్టోబర్ 2 నుండి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇంతకుముందు విశాఖలో ఒక టెస్టు మ్యాచ్ జరిగింది. 2016-17 సీజన్లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో టీమిండియా 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ సెంచరీ(167) చేయగా.. రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీ (81) చేశాడు. ఇక్కడ కోహ్లీకి ఘనమైన రికార్డు ఉండడంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది.
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ముందున్న ఓపెనింగ్ పరీక్షను ఎదుర్కొనడానికి సన్నాహక మ్యాచ్ రూపంలో దొరికిన అవకాశాన్ని రోహిత్ శర్మ (0) చేజార్చుకున్నాడు. రోహిత్.. ఫిలాండర్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. సంప్రదాయ ఫార్మాట్లో స్వింగ్ అయ్యే ఎరుపు బంతిని ఆడలేడన్న విమర్శకు తగ్గట్లే రోహిత్ వికెట్ సమర్పించుకున్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (92 బంతుల్లో 39; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.