ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం భారత మహిళల జట్టు తిరిగి అంతర్జాతీయ క్రికెట్ త్వరలోనే ఆడనుంది. దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్కు భారత మహిళల జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. మిథాలీ రాజ్ 50 ఓవర్ల ఆటకు, హర్మన్ప్రీత్ కౌర్ టీ20 ఫార్మాట్కు నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. సీనియర్ పేసర్ శిఖా పాండే, వికెట్కీపర్ తానియా భాటియాకు జట్టులో చోటు దక్కలేదు. యువ బ్యాటర్ షెఫాలీ వర్మను టీ20లకే పరిమితం చేశారు. వన్డే జట్టులో చోటు దక్కించుకున్న వికెట్కీపర్ శ్వేత వర్మ అరంగేట్రం చేయనుంది.
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో గల భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా అంతర్జాతీయ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మహిళా జట్లు తలపడనున్నాయి. వన్డే, టీ20 సిరీస్లోని మొత్తం 8 మ్యాచ్లను ఇక్కడే నిర్వహించనున్నారు. బయోబబుల్ వాతావరణంలో బీసీసీఐ ఈ రెండు సిరీస్లను నిర్వహించనుంది. మార్చి 7 నుంచి 17 వరకు వన్డే సిరీస్, మార్చి 20 నుంచి 23 వరకు టీ20 సిరీస్ జరుగనుంది. ఏడాది తర్వాత భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. ఇక భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాతో సిరీస్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంగ్లండ్తో సిరీస్ ఆడుతోంది.
వన్డే జట్టు:
మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, జెమిమా రోడ్రిక్స్, పూనమ్ రౌత్, ప్రియా పునియా, ఎస్తికా భాటియా, హర్మన్ప్రీత్ కౌర్, డీ హేమలత, దీప్తి శర్మ, సుష్మ వర్మ (వికెట్ కీపర్), శ్వేత వర్మ (వికెట్ కీపర్), రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి, మన్సి జోషి, పూనమ్ యాదవ్, సీ ప్రత్యూష, మోనిక పటేల్.
టీ20 జట్టు:
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిక్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, సుష్మ వర్మ (వికెట్ కీపర్), నుజాత్ పర్వీన్ (వికెట్ కీపర్), అయూషి సోని, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, మన్సి జోషి, మోనిక పటేల్, సీ ప్రత్యూష, సిమ్రాన్ దిల్ బహదూర్.
వికెట్ను పక్కన పెట్టి.. బ్యాట్స్మెన్ను నిందిస్తారా? కోహ్లీ వ్యాఖ్యలు కోపం తెప్పించాయి: కుక్