17 అంకెతో ఏదో బంధముంది:
విశాఖ నగరంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం నుంచి తొలి టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో అజింక్య రహానే మీడియాతో మాట్లాడాడు. 'ప్రతి మ్యాచ్, సిరీస్ నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. కెరీర్లో తొలి శతకం కోసం 17 టెస్టులు ఆడాను. 17 టెస్టుల తర్వాత వెస్టిండీస్లో సెంచరీ చేశా. ఇది చూస్తుంటే ఈ 17 అంకెతో నాకు ఏదో బంధముందనిపిస్తోంది' అని రహానే సరదాగా అన్నాడు.
సెంచరీ గురించి ఆలోచించలేదు:
'కౌంటీల్లో హ్యాంప్షైర్కు ఆడినప్పుడు ఒంటరిగా ఆలోచించేవాడిని. నా టెస్టు అరంగేట్రం ముందు నా ఆలోచన ధోరణి ఎలా ఉండేది?, ఇప్పుడు ఎలా ఉండేది? అని ఆలోచించా. ఎందుకు సెంచరీ చేయలేకపోతున్నా అనే ఆలోచనలు మెదడులో నిత్యం సాగేవి. నేను సెంచరీ కోసం ఆలోచించినంత కాలం చేయలేదు. ఇక విండీస్లో సెంచరీ గురించి ఆలోచించలేదు. ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. సెంచరీ చేయాలని రాసి ఉంటే చేస్తా అని అనుకున్నా' అని రహానే తెలిపాడు.
టెక్నిక్పైనే ఆధారపడటం లేదు:
'పరుగుల కోసం, భారీ ఇన్నింగ్స్లు సాధించడం కోసం పూర్తిగా టెక్నిక్పైనే ఆధారపడటం లేదు. మాటలు చెప్పినంత సులువు కాదు టెక్నిక్ మార్చడం. నేను నా సామర్థ్యాన్నే నమ్ముతాను, టెక్నిక్ను కాదు. క్లిష్టమైన పరిస్థితుల్లో మానసిక సమతౌల్యాన్ని పాటిస్తా. తిరిగి ఫామ్ అందుకొనేందుకు బ్యాటింగ్ టెక్నిక్పై ఎక్కువగా దృష్టి సారించలేదు' అని రహానే పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికా మేటి జట్టే:
'సొంతగడ్డపై మేం దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్తో టెస్టులు ఆడనున్నాం. టెస్టు ఛాంపియన్షిప్ కారణంగా ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోలేం. పాయింట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి మ్యాచ్ కీలకమే. స్వదేశంలో టెస్టులు గెలిచి విదేశాలకు వెళ్లినప్పుడు పాయింట్ల పరంగా ప్రయోజనం ఉంటుంది. డివిలియర్స్, డేల్ స్టెయిన్ లేకపోయినా.. దక్షిణాఫ్రికా మేటి జట్టే. ప్రస్తుత జట్టులో మార్క్రమ్, బవుమా, డుప్లెసిస్ సత్తాగల ఆటగాళ్లు ఉన్నారు. దక్షిణాఫ్రికాను ఏమాత్రం తేలిగ్గా తీసికోము' అని రహానే చెప్పుకొచ్చాడు.