జొహానెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల తేడాతో నెగ్గి నాలుగు టీ20ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. తిలక్ వర్మ (120 నాటౌట్; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 10 సిక్సర్లు), సంజు శాంసన్ (109 నాటౌట్; 56 బంతుల్లో, 6 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ శతకాలతో విధ్వంసం సృష్టించారు.
అభిషేక్ శర్మ (36; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు. సిపామ్లా (1/58) ఒక్క వికెట్ తీశాడు. అనంతరం కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. 10 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోగా..హెన్రిచ్ క్లాసెస్ (43; 29 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (36; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (3/20) మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి (2/42), అక్షర్ పటేల్ (2/6) చెరో రెండు వికెట్లు, హార్దిక్, రమన్దీప్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

కాగా, మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ వివరించాడు. అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శన ఓటమికి కారణమని అన్నాడు. అయితే తమ బౌలర్లు వైడ్ల రూపంలో ఏకంగా 17 పరుగులు సమర్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ''ఇది భరించలేని ఓటమి. అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శన చేశాం. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేద్దామనకున్నాం. కానీ అలా జరగలేదు. బ్యాటు, బంతితో టీమిండియా మాపై ఒత్తిడి తీసుకువచ్చింది''
''ఈ రోజుల్లో నేరుగా స్టంప్స్కు బౌలింగ్ చేయలేం. వైడ్ లైన్స్ వైపు బంతులు వేయాల్సి ఉంటుంది. అయితే రెండు మూడు వైడ్లు వేస్తే సంతోషించేవాడిని. కానీ 15+ వైడ్లు కాదు. మెరుగ్గా ప్రణాళికలు అమలు చేయాల్సింది. జట్టుగా సరైన మార్గంలో నడవాల్సి ఉంది. 2026లోపు సాధిస్తామని భావిస్తున్నా. స్ట్రాంగ్ ప్లేయర్లుగా తిరిగిరావడానికి ప్రయత్నిస్తాం. ఇక ఈ సిరీస్లో మార్కో జేన్సన్, గెరాల్డ్ కొయెట్జీ ప్రదర్శన మాకు సానుకూలాంశాలు'' అని ఎయిడెన్ మార్క్రమ్ పేర్కొన్నాడు.