విశాఖపట్నం: విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్లో టెంబా బవుమా (18; 26 బంతుల్లో 3x4) ఎల్బీగా ఔట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయి కష్టాలలో పడింది. దక్షిణాఫ్రికా 39/3తో మూడో రోజు ఆటను ప్రారంబించింది. ఉదయం ఇషాంత్ శర్మ బౌలింగ్ ప్రారంభించాడు. ఆ తర్వాత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంతిని అందుకున్నాడు. ఈ ఇద్దరు దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్పై ఒత్తిడి పెంచారు.
టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఎల్గర్, బవుమా నిలకడగా ఆడారు. ఈ క్రమంలో 27వ ఓవర్ వేసిన ఇషాంత్ తొలి బంతికే బవుమాను పెవిలియన్ చేర్చాడు. ఈ రోజు బవుమా మూడు బౌండరీలు బాదాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇప్పటికే 5 ఫోర్లు, ఓ సిక్స్ కొట్టి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. మరోవైపు ఎల్గర్ మాత్రం వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేస్తున్నాడు.
40వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్లో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ ఎల్గర్ బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. డుప్లెసిస్ అతనికి చక్కటి అందిస్తున్నాడు. ఈ ఇద్దరు ఇప్పటికే 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. 41 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్ (35), ఎల్గర్ (56) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇంకా టీమిండియా తొలి ఇన్నింగ్స్కు 381 పరుగులు వెనకబడి ఉంది. రెండో రోజు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లలో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (5), డి బ్రూన్ (4) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరగా.. డేన్ పీడ్ (0) డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీయగా.. ఇషాంత్, జడేజాకు తలో వికెట్ లభించింది.
అంతకముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ను 136 ఓవర్లకు గాను 502/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. టీమిండియా డిక్లేర్ చేసే సమయానికి రవీంద్ర జడేజా (30), రవిచంద్రన్ అశ్విన్ (1) అజేయంగా నిలిచారు. రోహిత్ శర్మ (176, 244 బంతుల్లో; 23 ఫోర్లు, 6 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్ (371 బంతుల్లో 215, 22 ఫోర్లు, 5 సిక్సులు) టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీయగా.. ఫిలాండర్, డేన్ పీడ్త్, ముత్తుస్వామి, డీన్ ఎల్గర్లు తలో వికెట్ తీశారు.