జొహానెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల తేడాతో నెగ్గి నాలుగు టీ20ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. తిలక్ వర్మ (120 నాటౌట్; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 10 సిక్సర్లు), సంజు శాంసన్ (109 నాటౌట్; 56 బంతుల్లో, 6 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ శతకాలతో విధ్వంసం సృష్టించారు.
అభిషేక్ శర్మ (36; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు. సిపామ్లా (1/58) ఒక్క వికెట్ తీశాడు. అనంతరం కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. హెన్రిచ్ క్లాసెస్ (43; 29 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (36; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (3/20) మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి (2/42), అక్షర్ పటేల్ (2/6) చెరో రెండు వికెట్లు, హార్దిక్, రమన్దీప్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

కాగా, మ్యాచ్ అనంతరం విజయానికి గల కారణాలను టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడాడు. ''పరిస్థితులకు చక్కగా అలవాటు పడటంలో ఎలాంటి రహస్యం లేదు. మా ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి. గతంలో దక్షిణాఫ్రికాకు వచ్చినప్పుడు ఇదే బ్రాండ్ క్రికెట్ ఆడాం. దాన్ని కొనసాగించాం. ఇవాళ మ్యాచ్ గురించి చెప్పాలంటే.. మంచి అలవాటులు కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. ఫలితాలు గురించి ఆలోచించవద్దనుకున్నాం''
''తిలక్ వర్మ, సంజు శాంసన్ సెంచరీలలో ఒకటిని ఎంచుకోవడం చాలా కష్టం. వారిద్దరు గొప్పగా బ్యాటింగ్ చేశారు. ఇక మా బౌలింగ్ విషయానికొస్తే.. ఫ్లడ్ లైట్స్, ఉష్ణోగ్రత తగ్గిన అనంతరం మాకు అనుకూలిస్తుందని భావించాం. చక్కని లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి ఫలితాన్ని రాబట్టాం. దక్షిణాఫ్రికా పర్యటన గురించి చెప్పాలంటే.. ఇక్కడికి వచ్చి గెలిచి వెళ్లడమంటే సవాలే. ఇది ఎంతో ప్రత్యేకమైన విజయం. కోచింగ్ సిబ్బంది గొప్పగా సహకరిస్తుంది'' అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.