న్యూఢిల్లీ: ఊహించినట్టే భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే ఆలస్యమైంది. ఢిల్లీ ఫిరోజ్షా కోట్లా అరుణ్ జైట్లీ స్టేడియం తడిచి ముద్దయిన కారణంగా టాస్ పడలేదు. మధ్యాహ్నం ఒంటిగంటకు టాస్ పడాల్సి ఉండగా.. అంపైర్లు వాయిదా వేశారు. 1:30కు పిచ్, అవుట్ ఫీల్డ్ను పరిశీలించిన తరువాత టాస్పై నిర్ణయం తీసుకుంటారు. మూడో వన్డేల సిరిస్లో ఇది చివరిది. సిరీస్ డిసైడర్ కావడం వల్ల ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉందని భావించినప్పటికీ.. ఆలస్యం కావడం అభిమానులను నిరుత్సాహానికి గురి చేసింది.
మూడు, నాలుగు రోజులుగా ఢిల్లీలో అడపాదడపా వర్షం పడుతూనే వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గ్రౌండ్ స్టాఫ్ పిచ్ను పూర్తిగా కవర్ చేసి ఉంచింది. నాలుగు రోజుల కిందట వర్షం పడినప్పుడు వేసిన కవర్లు మళ్లీ తియ్యలేదు. అవుట్ ఫీల్డ్ మాత్రం చిత్తడిగా మారింది. ఇవ్వాళ కూడా ఉదయం ఓ మోస్తరు వర్షం పడింది.
समय पर मैच शुरू करने की पुरज़ोर कोशिश जारी है। पिछले तीन-चार दिनों से रुक-रुक कर हो रही बारिश के कारण आउटफ़ील्ड काफ़ी गिला है। #INDVSA #CricketTwitter
— Kunal Kishore (@ImKunalKishore) October 11, 2022
नोट: विज़ुअल्स एक घंटे पहले के हैं। pic.twitter.com/GBPotTTUMm
మూడు వన్డేల ఈ సిరీస్లో ప్రస్తుతం భారత్-దక్షిణాఫ్రికా సమవుజ్జీగా ఉన్నాయి. చెరో మ్యాచ్ గెలిచాయి. రెండో వన్డేలో భారీ స్కోరుతో కదం తొక్కారు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ 84 బంతుల్లో 93లు చేశాడు. ఏడు పరుగులతో సెంచరీ మిస్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ ఆ కొరతను తీర్చుకున్నాడు. 113 పరుగులు చేశారు. సంజు శాంసన్ 30 పరుగులతో నాటౌట్గా నిలిచాడా మ్యాచ్లో. తొలి వన్డేలో సంజు శాంసన్ 86 పరుగులు చేసి సత్త చాటాడు. ఈ ముగ్గురు యంగ్ టర్క్లు ఇవ్వాళ్టి మ్యాచ్లో చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది.
మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్కు సహకరించే అవకాశం ఉన్నందున టాస్ గెలిస్తే తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడానికే కేప్టెన్ శిఖర్ ధావన్ మొగ్గు చూపొచ్చు. సాధారణంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లకు ఇదో మంచి ట్రాక్. అవుట్ఫీల్డ్ కూడా వేగంగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల రెండో ఇన్నింగ్లో బౌలర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. బంతిపై గ్రిప్ కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొనవచ్చు.
ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉంది. పగటి ఉష్ణోగ్రత 28 డిగ్రీల వరకు నమోదైంది. ఫిరోజ్ షా కోట్లా మైదానం పరిసరాల్లో ఓ మోస్తరుగా కురిసిన వర్షం వల్ల అవుట్ ఫీల్డ్ మొత్తం తడిచిపోయింది. దీన్ని ఎండబెట్టడానికి గ్రౌండ్ స్టాఫ్ చెమటోడుస్తోన్నారు. మధ్యాహ్నం తరువాత కూడా వర్షం పడటానికి అవకాశం ఉంది. కొన్ని రోజులుగా ఢిల్లీలో అడపాదడపా వర్షాలు కురుస్తోన్నాయి. ఇవ్వాళ కూడా పలుచోట్ల వర్షం పడింది.