దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు టీ20ల సిరీస్ను భారత్ ఘనంగా బోణీ కొట్టింది. డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్రౌండ్ షోతో సత్తాచాటి సఫారీలను చిత్తు చేసింది. అదే జోరులో సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో టీ20లోనూ గెలవాలని టీమిండియా పట్టుదలతో సిద్ధమవుతోంది.
మరోవైపు రేపటి మ్యాచ్లో గెలిచి భారత్ ఆధిక్యాన్ని 1-1తో సమం చేయాలని సౌతాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే రెండో టీ20 సజావుగా సాగడం అనుమానమే. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. టాస్ పడే సమయానికి, మ్యాచ్ జరిగే కొద్దీ,అంతేగాక ఛేదనలోనూ వరుణుడు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

వాతావరణ శాఖ ప్రకారం.. టాస్ పడే సమయానికి 49-54 శాతం వరకు వర్షం పడే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్ష సూచన 63 శాతానికి పెరగనుంది. సెకండ్ ఇన్నింగ్స్లో వర్షం ముప్పు ఉంది. 40 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెల్సియస్ కట్టే తక్కువగా ఉండనుంది. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి రద్దు కానప్పటికీ, సజావుగా సాగడం దాదాపుగా అసాధ్యమే.
అయితే ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా భారత తుదిజట్టులో మార్పు చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అక్షర్ పటేల్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ రమన్దీప్ సింగ్ను తుదిజట్టులోకి తీసుకురావాలని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావిస్తున్నాడు. వర్పం ముప్పు కారణంగా పిచ్ పేసర్లకు అనుకూలంగా మారనుంది. దీంతో విన్నింగ్ కాంబినేషన్ను మార్చాలనే ఉద్దేశం లేకపోయినా స్పిన్ ఆల్రౌండర్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ను తీసుకోవాలనుకుంటున్నాడు.

భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, రమన్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్.
దక్షిణాఫ్రికా తుది జట్టు (అంచనా)
రికెల్టన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ప్యాట్రిక్ క్రుగర్, మార్కో జేన్సన్, గెరాల్డ్ కొయెట్జీ, ఆండిలే సిమెలన్, కేశవ్ మహరాజ్, బార్టమన్.