
బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కొనసాగుతున్న టీ20 సిరీస్లో చిట్టచివరి మ్యాచ్.. ఈ సాయంత్రం జరుగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ సిరీస్లో ఇదే అయిదవది.. చివరిదీను. ఇందులో గెలిచిన వాడిదే సిరీస్. ప్రస్తుతం రెండు జట్లు రెండు చొప్పున విజయాలను సాధించాయి.. 2-2తో సమవుజ్జీగా నిలిచాయి. సిరీస్ విజేతను తేల్చేసే మ్యాచ్ కావడం వల్ల రసవత్తరంగా మారింది.
దక్షిణాఫ్రికాపై ఉన్న ఓ చెత్త రికార్డును చెరిపేసుకోవడంపై టీమిండియా దృష్టి సారించింది. దానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ దొరక్కపోవచ్చు. ఇప్పటివరకు భారత జట్టు- సొంత గడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించలేదు. టీ20 ద్వైపాక్షిక సిరీస్ను గెలవలేదు. 2015లో ప్రొటీస్ టీమ్.. స్వదేశంలో భారత జట్టును ఓడించి- సగర్వంగా సిరీస్ను ఎగరేసుకెళ్లింది. 2019లో సిరీస్ను సమం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం భారత్కు దక్కింది.
2015-16లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. అప్పట్లో టీమిండియాకు మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వాన్ని వహించాడు. తొలి టీ20 మ్యాచ్ రద్దయింది. రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా.. ఆరు వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. మూడో టీ20లోనూ దాన్ని రిపీట్ చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ రెండు విజయాలతో సిరీస్ను సొంతం చేసుకుంది ప్రొటీస్ టీమ్.
2019-20లో దక్షిణాఫ్రికా మరోసారి భారత పర్యటనకు వచ్చింది. అప్పట్లో విరాట్ కోహ్లీ కేప్టెన్సీలోని భారత జట్టు మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టింది. తొలి మ్యాచ్ రద్దు కాగా.. ఈ తరువాతి రెండు మ్యాచ్లను భారత్, దక్షిణాఫ్రికాలు గెలుచుకున్నాయి. రెండో మ్యాచ్ను భారత్ ఏడు వికెట్ల తేడాతో సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీనితో సిరీస్ సమమైంది.
ఇప్పుడు మళ్లీ భారత్లో పర్యటిస్తోంది సౌతాఫ్రికన్ టీమ్. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇది. ఈ సారి రిషభ్ పంత్ జట్టుకు కేప్టెన్గా వ్యవహరిస్తోన్నాడు. తొలి నాలుగింటినీ ఈ రెండు సమంగా పంచుకున్నాయి. తొలి రెండు మ్యాచ్లు దక్షిణాఫ్రికా ఖాతాలో పడ్డాయి. చివరి రెండింటినీ టీమిండియా కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంలకు ప్రారంభం కానుంది. బెంగళూరు మ్యాచ్లో భారత్ విజయఢంకా మోగించగలిగితే- ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల వల్ల సాధ్యం కాని సిరీస్ కైవసం అనేది రిషభ్ పంత్ ఖాతాలో పడుతుంది.