బెంగళూరు: భారత్-దక్షిణాఫ్రికా మధ్య సాగుతున్న అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్.. కేప్టెన్ రిషభ్ పంత్ను విమర్శలకు గురి చేస్తోంది. అతని బ్యాటింగ్ శైలిపై దుమారం చెలరేగుతోంది. ఇప్పటివరకు ముగిసిన నాలుగు మ్యాచ్లల్లో అతను చేసింది 57 పరుగులే. ఇవ్వాళ్టి చివరి మ్యాచ్లోనూ భారీగా పరుగులు చేస్తాడనే అంచనాలు పెద్దగా లేవు. కేప్టెన్గా చివరి రెండింట్లో భారత జట్టును విజయం వైపు నడిపించాడనే పేరు తెచ్చుకున్నాడే గానీ.. బ్యాటర్గా సత్తా చాటలేకపోయాడు.
అతని బ్యాటింగ్ శైలిపై పలువురు మాజీలు, లెజెండరీ క్రికెటర్లు విమర్శలను సంధిస్తోన్నారు. సునీల్ గవాస్కర్, వసీం జాఫర్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా, ఇర్ఫాన్ పఠాన్.. వంటి ప్లేయర్లు రిషభ్ పంత్ బ్యాటింగ్ను తప్పుపడుతున్నారు. షాట్ల ఎంపికలో పంత్ తప్పు చేస్తోన్నాడని స్పష్టం చేస్తోన్నారు. అనవసరపు షాట్లతో చేజేతులా తన వికెట్ను పారేసుకుంటున్నాడంటూ అభిప్రాయపడుతున్నారు.
తాను చేసిన తప్పుల నుంచి రిషభ్ పంత్ గుణపాఠాలను నేర్చుకోలేకపోతున్నాడని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. తొలి మూడు మ్యాచ్లల్లో ఎలాంటి పొరపాట్లతో అవుట్ అయ్యాడో.. నాలుగో మ్యాచ్లోనూ దాన్ని పునరావృతం చేశాడని పేర్కొన్నారు. షాట్ల ఎంపికలో తప్పులు చేస్తోన్నాడని అన్నారు. అనవసరపు షాట్లతో తొలి మూడు మ్యాచ్లల్లో వికెట్ను పారేసుకున్నాడని, నాలుగో మ్యాచ్లోనూ అదే తరహాలో అవుట్ అయ్యాడని గుర్తు చేశారు. జట్టు సారథే అలా అవుట్ కావడం జట్టుకు మంచిది కాదని వ్యాఖ్యానించారు.
వైడ్ బంతులను వెంటాడటాన్ని రిషభ్ పంత తన బలహీనతగా మార్చకున్నట్లు కనిపిస్తోందని సునీల్ గవాస్కర్ అన్నారు. స్టంప్స్కు దూరంగా పడే బంతులను ఆడే సమయంలో బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుందని, పంత్ అలా చేయట్లేదని చెప్పారు. అఫ్ స్టంప్కు దూరంగా వెళ్తోన్న బంతులను ఏరియల్ షాట్లు మలచడానికి తాపత్రయపడుతున్నాడని అన్నారు. ఈ నాలుగు మ్యాచ్లలోనూ అతను దాదాపుగా ఒకేరకంగా అవుట్ అయ్యాడని చెప్పారు.
ఈ సిరీస్లో రిషభ్ పంత్ ఇప్పటివరకు 57 పరుగులు చేశాడు. యావరేజ్ 14.25. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండట్లేదు. 105.55తో బ్యాటింగ్ సాగుతోంది. తొలి మ్యాచ్లో 16 బంతుల్లో 29, రెండో మ్యాచ్లో ఎనిమిది బంతుల్లో ఆరు, మూడో మ్యాచ్లో ఏడు బంతుల్లో అయిదు, నాలుగో మ్యాచ్లో 22 బంతుల్లో 17 పరుగులు చేశాడు రిషభ్ పంత్. కేప్టెన్గా ఫర్వాలేదనిపించుకుంటోన్నాడు.