
బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కొనసాగుతున్న టీ20 సిరీస్లో చిట్టచివరి మ్యాచ్.. ఈ సాయంత్రం జరుగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ సిరీస్లో ఇదే అయిదవది.. చివరిదీను. ఇందులో గెలిచిన వాడిదే సిరీస్. ప్రస్తుతం రెండు జట్లు రెండు చొప్పున విజయాలను సాధించాయి.. 2-2తో సమవుజ్జీగా నిలిచాయి. సిరీస్ విజేతను తేల్చేసే మ్యాచ్ కావడం వల్ల రసవత్తరంగా మారింది.
ఈ సిరీస్లో ప్రస్తుతానికి ఆధిపత్యం మాత్రం టీమిండియాదే. తొలి రెండు మ్యాచ్లను కోల్పోయిన తరువాత.. తిరిగి పుంజుకొంది. రేసులోకొచ్చింది. చివరి రెండు మ్యాచ్లల్లో అద్భుతంగా ఆడింది. పైచేయిని సాధించింది. అదే దూకుడును అయిదవది, చివరిదీ అయిన బెంగళూరు మ్యాచ్లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. దీనికి అనుగుణంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది భారత జట్టు. ప్లేయర్లందరూ చెమటోడుస్తున్నారు.
ఈ మ్యాచ్ కోసం తుదిజట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశాలు లేవు. వరుస విజయాలను సాధించిన జట్టుతోనే దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ను ఇవ్వాళ్టి మ్యాచ్లోనూ కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాటికి సిరీస్ను కోల్పోయి ఉంటే.. కొత్త ముఖాలకు అవకాశం దక్కి ఉండేదేమో.
ఈ పరిణామాలు కాస్త.. ఐపీఎల్ స్టార్లకు కొద్దిగా నిరాశ కలిగించేదే. సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ బౌలింగ్ వీరులు ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్- తొలిసారిగా భారత జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఎంపికయ్యారన్న మాటే గానీ- మ్యాచ్ ఆడే అవకాశం వారికి దక్కలేదు. తుదిజట్టులో చోటు దక్కలేదు. డగౌట్కే పరిమితం అయ్యారు వారిద్దరూ. ఉమ్రాన్ మాలిక్.. అర్ష్దీప్ సింగ్ ఐపీఎల్లో ఇంప్రెస్సివ్ పెర్ఫార్మెన్స్ను చూసి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది సెలెక్షన్ కమిటీ.
జట్టు ఆటగాళ్లందరూ సమష్టిగా రాణిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎలాంటి ప్రయోగాలకు ఇష్టపడట్లేదు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. ఇప్పుడున్న వాళ్లతోనే చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొనడానికే ఆయన మొగ్గు చూపుతున్నారు. రాజ్కోట్ మ్యాచ్లో అవేష్ ఖాన్ నాలుగు వికెట్లతో సత్తా చాటి మరీ.. తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితంగా ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్లల్లో ఎవరో ఒకరిని తుదిజట్టులోకి తీసుకోవచ్చనే అంచనాలకు తెరదించాడు.