బెంగళూరు: భారత్-దక్షిణాఫ్రికా మధ్య సాగుతున్న అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్.. కేప్టెన్ రిషభ్ పంత్ను విమర్శలకు గురి చేస్తోంది. అతని బ్యాటింగ్ శైలిపై దుమారం చెలరేగుతోంది. ఇప్పటివరకు ముగిసిన నాలుగు మ్యాచ్లల్లో అతను చేసింది 57 పరుగులే. ఇవ్వాళ్టి చివరి మ్యాచ్లోనూ భారీగా పరుగులు చేస్తాడనే అంచనాలు పెద్దగా లేవు. కేప్టెన్గా చివరి రెండింట్లో భారత జట్టును విజయం వైపు నడిపించాడనే పేరు తెచ్చుకున్నాడే గానీ.. బ్యాటర్గా సత్తా చాటలేకపోయాడు.
అతని బ్యాటింగ్ శైలిపై పలువురు మాజీలు, లెజెండరీ క్రికెటర్లు విమర్శలను సంధిస్తోన్నారు. సునీల్ గవాస్కర్, వసీం జాఫర్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా, ఇర్ఫాన్ పఠాన్.. వంటి ప్లేయర్లు రిషభ్ పంత్ బ్యాటింగ్ను తప్పుపడుతున్నారు. షాట్ల ఎంపికలో పంత్ తప్పు చేస్తోన్నాడని స్పష్టం చేస్తోన్నారు. అనవసరపు షాట్లతో చేజేతులా తన వికెట్ను పారేసుకుంటున్నాడంటూ అభిప్రాయపడుతున్నారు.
డానిష్ కనేరియా కాస్త ఘాటుగానే కామెంట్స్ చేశారు. రిషభ్ పంత్ స్థూలకాయుడయ్యాడని వ్యాఖ్యానించారు. ఓవర్ వెయిట్ వల్ల ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోందని స్పష్టం చేశారు. అతను తన బ్యాటింగ్ శైలిని మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. బ్యాటింగ్ శైలిని మెరుగుపర్చుకోపోతే.. టీమిండియా తుది జట్టులో తన స్థానాన్ని కోల్పోయే పరిస్థితిని ఖచ్చితంగా ఎదుర్కొంటాడని అన్నారు.
వికెట్ కీపర్గా కూడా అతను పెద్దగా రాణించట్లేదనే తాను భావిస్తున్నానని డానిష్ కనేరియా పేర్కొన్నారు. ఫాస్ట్ బౌలర్లు బంతులను సంధించే సమయంలో వికెట్ల వెనుకల రిషభ్ పంత్ వంగట్లేదని, అలాగని మోకాళ్ల మీద కూడా కూర్చోవట్లేదని గుర్తు చేశారు. నిల్చొనే కీపింగ్ చేస్తున్నాడని అన్నారు. దీనికి ప్రధాన కారణం.. అతను తన స్థూలకాయుడిగా మారడమేనని చెప్పారు. వికెట్ల వెనుకల బద్ధకంగా కదులుతున్నాడని వివరించారు.
కేఎస్ భరత్, వృద్ధిమాన్ సాహా వంటి వికెట్ కీపర్లు అందుబాటులో ఉన్న సమయంలో రిషభ్ పంత్కు కొంత విశ్రాంతిని కల్పించాల్సిన అవసరం కూడా ఉందని డానిష్ కనేరియా స్పష్టం చేశారు. అతని కొంత బ్రేక్ అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సిరీస్లో రిషభ్ పంత్ ఇప్పటివరకు 57 పరుగులు చేశాడు. యావరేజ్ 14.25. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండట్లేదు. 105.55తో బ్యాటింగ్ సాగుతోంది. తొలి మ్యాచ్లో 16 బంతుల్లో 29, రెండో మ్యాచ్లో ఎనిమిది బంతుల్లో ఆరు, మూడో మ్యాచ్లో ఏడు బంతుల్లో అయిదు, నాలుగో మ్యాచ్లో 22 బంతుల్లో 17 పరుగులు చేశాడు రిషభ్ పంత్.