
ఇక టీ20 సిరీస్ బిగిన్స్..
దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ప్రొటీస్ టీమ్తో స్వదేశంలో టీ20 సిరీస్ను ఆడుతుంది భారత్. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉంటుంది. 17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ.

ఒక అడుగు ముందే ఉన్న దక్షిణాఫ్రికా..
భారత పర్యటనకు వచ్చే దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించే విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ అడుగు ముందే ఉంది. కొద్దిసేపటి కిందటే జట్టును ప్రకటించింది. 16 మందిని జట్టులోకి తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సీజన్లో ఆడుతున్న ప్లేయర్లు సగం మంది వరకు ఉన్నారు. ఐపీఎల్లో ఆడుతున్న నేపథ్యంలో భారత పిచ్లు, బౌలింగ్ తీరు, అక్కడి వాతావరణ పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉంటుందనే ఉద్దేశం క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు పెద్దల్లో కనిపించింది.

ముంబై ఇండియన్స్ ప్లేయర్కు చోటు..
ట్రిస్టన్ స్టబ్స్కు జట్టులో చోటు దక్కింది. దక్షిణాఫ్రికా తరఫున టీ20 ఫార్మట్లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టబోతున్నాడు స్టబ్స్. అతనికి ఇదే తొలి ఇంటర్నేషనల్ సిరీస్. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. అలాగే- సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మిడిలార్డర్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్, పేస్ బౌలర్ మార్కో జెన్సెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ డ్వైన్ ప్రిటోరియస్, లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్, గుజరాత్ టైటాన్స్ మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్, ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న బౌలర్లు ఎన్రిచ్ నోర్ట్జె, కగిసొ రబడ, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రస్సీ వాన్డర్ డుస్సెన్ ఈ పర్యటనకు ఎంపికయ్యారు.

టెంబా బావుమా కేప్టెన్సీలో..
ఈ జట్టుకు టెంబా బావుమా నాయకత్వాన్ని వహిస్తున్నాడు. అతని సారథ్యంలో భారత పర్యటనకు వచ్చే దక్షిణాఫ్రికా జట్టులో- క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, ఎన్రిచ్ నోర్ట్జె, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసొ రబడ, తబ్రేజ్ శాంసీ, ట్రిస్టస్ స్టబ్స్, రస్సీ వ్యాన్ డెర్ డుస్సెన్, మార్కో జెన్సెన్ చోటు దక్కించుకున్నారు. వేన్ పార్నెల్ 2017 తరువాత మళ్లీ టీ20 జట్టులోకి స్థానం సాధించాడు.

26న భారత జట్టు ప్రకటన..
ఈ సిరీస్ కోసం జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తు ఆరంభించింది. ఈ నెల 26వ తేదీన జట్టును ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 15 మంది ఆటగాళ్ల పేర్లతో కూడిన జాబితాకు తుదిరూపాన్ని ఇవ్వడంపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీ దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్లో పెర్ఫార్మెన్స్తో పాటు ప్లేయర్ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ నెల 23 లేదా 24వ తేదీల్లో రావొచ్చని అంటున్నారు.

23న సెలెక్షన్ కమిటీ మీటింగ్..
ప్లేయర్ల జాబితాను ఖరారు చేయడానికి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. ముంబైలోని బీసీసీఐ కార్యాలయం దీనికి వేదిక అయింది. ఈ సమావేశానికి కేప్టెన్ రోహిత్ శర్మ కూడా హాజరు కానున్నారు. ఆయన అభిప్రాయాన్ని తీసుకున్న తరువాతే- ఈ జాబితాపై అధికారిక ముద్ర పడుతుంది. 26వ తేదీన ప్లేయర్ల లిస్ట్ను అధికారికంగా ప్రకటిస్తుందని బీసీసీఐ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.