ముంబై: దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ మ్యాచ్ల కోసం గాయపడ్డ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో హైదరాబాద్కు చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్కు అవకాశం దక్కింది. బుమ్రా స్థానాన్ని సిరాజ్తో భర్తీ చేసినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. మిగిలిన రెండు టీ20 మ్యాచ్లల్లో బుమ్రాకు బదులుగా సిరాజ్ ఆడనున్నట్లు తెలిపింది. కోవిడ్ నుంచి కోలుకున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ- సిరాజ్ వైపే మొగ్గు చూపింది బోర్డ్.
ఈ సిరీస్లో గనక సిరాజ్ తన శక్తి సామర్థ్యాలేమిటో నిరూపించకోగలిగితే- టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లోనూ అడుగు పెట్టడం ఖాయమౌతుందనుకున్న దశలో బాంబు పేల్చింది బీసీసీఐ. అదే దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడబోయే మూడు మ్యాచ్ల వన్డే ఇంటర్నషనల్స్ కోసం మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అతనికి సమాచారాన్ని కూడా పంపించినట్లు తెలుస్తోంది. అంటే- ఈ రెండు టీ20 మ్యాచ్లకు మాత్రమే సిరాజ్ ఆడతాడు.
టీ20ల్లో దక్షిణాఫ్రికాపై సిరాజ్ పెర్ఫార్మెన్స్ చూసిన తరువాతే బీసీసీఐ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని మొదట భావించినప్పటికీ- అంతకంటే ముందే మహ్మద్ షమీని ఆడించాలనే విషయంపై ఓ కొలిక్కి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫిట్నెస్ సాధించాలనే ఉద్దేశంతోనే షమీని టీ20 మ్యాచ్లకు తీసుకోలేదు. ఈ సిరీస్ ముగిసిన వెంటనే అంటే అక్టోబర్ 6వ తేదీ నుంచి ఆరంభం అయ్యే వన్డే ఇంటర్నేషనల్స్ సిద్ధం కావాలంటూ షమీకి సమాచారం పంపించినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు వన్డే ఇంటర్నేషనల్స్తో కూడిన సిరీస్ను ఆడాల్సి ఉంది. లక్నో, రాంచీ, ఢిల్లీల్లో ఈ మూడూ షెడ్యూల్ అయ్యాయి. అన్నీ డేనైట్ మ్యాచ్లే. ఈ సిరీస్కు శిఖర్ ధావన్ నాయకత్వాన్ని వహించే అవకాశం ఉంది. దీనికోసం కొత్తగా మళ్లీ జట్టును ఎంపిక చేయాల్సి ఉంది బీసీసీఐకి. దీని తరువాత టీ20 ప్రపంచకప్ను ఆడటానికి ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్తుంది.
వెన్నెముక ఫ్రాక్చర్ వల్ల టీ20 ప్రపంచకప్కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని రీప్లేస్ చేయాలని నిర్ణయించుకున్నామని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. దీన్ని అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు సన్నద్ధం కావాలంటూ ఇప్పటికే షమీకి సమాచారాన్ని సైతం బీసీసీఐ పంపించిందని సమాచారం. టీ20 వరల్డ్ కప్కు ముందు షమీతో ఓ సిరీస్ను ఆడించడం ఎందుకైనా మంచిదనే అభిప్రాయాలో ఉన్నట్లు చెబుతున్నారు.