దక్షిణాఫ్రికాతో సిరీస్..
ఈ మెగా టోర్నమెంట్ ముగిసిన తరువాత దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత జట్టు సన్నాహకం కావాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో అయిదు మ్యాచ్ టీ20 సిరీస్ను ఆడుతుంది టీమిండియా. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉంటుంది.
ప్రొటీస్ టీమ్ రెడీ..
17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తన జట్టును ఇదివరకే ప్రకటించింది కూడా. భారత పర్యటనకు వచ్చే 16 మంది సభ్యులు ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు టెంబా బావుమా సారథ్యాన్ని వహించనున్నాడు. ఈ నెల చివరన లేదా వచ్చే నెల మొదటివారంలో జట్టు భారత్కు చేరుకుంటుంది.
ఇవ్వాళే ప్రకటన..
కాగా- ఈ సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక ఇవ్వాళ పూర్తవుతుంది. దీనికోసం సెలెక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ షెడ్యూల్ అయింది. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ సారథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. రెండు జట్లుగా టీమిండియాను విభజించడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడబోయే టీ20 టీమ్కు శిఖర్ ధవన్ సారథ్యాన్ని వహించబోతున్నాడు. ఇందులో టీ20 స్పెషలిస్టులను తీసుకోనుంది సెలెక్షన్ కమిటీ.
హెడ్ కోచ్గా వీవీఎస్..
ఈ టీ20 స్పెషలిస్ట్ జట్టుకు హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ అపాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి మెంటార్గా వ్యవహరించిన అనుభవం అతనికి ఉంది. నేషనల్ క్రికెట్ అకాడమీ ఛైర్మన్గా పని చేస్తున్నాడీ హైదరాబాదీ మాజీ టెస్ట్ క్రికెటర్. వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతోండటం వల్ల హెడ్ కోచ్గా ఆయన ఎంపిక దాదాపు పూర్తయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్కు పిలుపు రావొచ్చు. అర్ష్దీప్ సింగ్ పేరు కూడా వినిపిస్తోంది.
రోహిత్ కేప్టెన్సీలో..
ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లే సీనియర్ల జట్టుకు రోహిత్ శర్మ కేప్టెన్గా వ్యవహరిస్తాడు. జూన్ 15వ తేదీ నుంచి రోహిత్ శర్మ కేప్టెన్సీలోని సీనియర్ల జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. దీనికి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ కంటిన్యూ అవుతాడు. ఆయా జట్ల ఎంపిక కోసం బీసీసీఐ కసరత్తు పూర్తి చేసింది. ఇవ్వాళ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 16 మంది ఆటగాళ్ల పేర్లతో కూడిన జాబితాను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించనుంది.
కోహ్లీ సహా..
విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. అతనితో పాటు కనీసం నలుగురు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఈ సీజన్లో నిలకడగా రాణిస్తోన్న వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ను జట్టులోకి తీసుకోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మొదట్లో విజృంభించిన సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రన్ మాలిక్.. తదనంతరం పెద్దగా ప్రభావాన్ని చూపకపోవడం వల్ల అతని పేరును పరిశీలనలోకి తీసుకోకపోవచ్చనీ అంటున్నారు.