
న్యూఢిల్లీ: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవ్వాళ అయిదు టీ20 మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా.. భారత పర్యటనకు వచ్చింది. తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆరంభమౌతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో లేరు. సిరీస్ ఆరంభానికి ముందే కేప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టుకు దూరం అయ్యారు.
కేఎల్ రాహుల్కు బదులుగా రిషబ్ పంత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కేప్టెన్గా అపాయింట్ అయ్యాడు. వీరిద్దరి నేతృత్వంలోనే టీమిండియా.. దక్షిణాఫ్రికాతో అయిదు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. 12వ తేదీన రెండో మ్యాచ్ ఒడిశా కటక్లోని బారాబతి స్టేడియంలో షెడ్యూల్ అయింది. మూడో మ్యాచ్ మన విశాఖపట్నంలో ఉంటుంది. ఈ నెల 14వ తేదీన ఈ మ్యాచ్ ఉంటుంది. 17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్లోని రాజ్కోట్, అయిదవది 19వ తేదీన బెంగళూరులో షెడ్యూల్ అయ్యాయి.
ఇవ్వాళ్టి మ్యాచ్ కోసం తుదిజట్టు దాదాపు సెలెక్ట్ అయినట్టే. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్-వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్/దీపక్ హుడా, అక్షర్ పటేల్/రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యజువేంద్ర చాహల్ ఆడొచ్చు.
టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. ఈ సాయంత్రం జరిగే తొలి టీ20 మ్యాచ్ కోసం తాను ఎంపిక చేసిన తుదిజట్టును ప్రకటించాడు. జట్టు కూర్పు ఇలా ఉంటే బాగుంటుందనే తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. వసీం జాఫర్ ఎంపిక చేసిన తుదిజట్టులో సన్రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్కు చొోటు దక్కలేదు. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో నిలకడగా బంతులను సంధించే ఉమ్రాన్ మాలిక్.. తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.
వసీంజాఫర్ ఎంపిక చేసిన ప్లేయింగ్ 11 ప్రకారం.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (కెప్టెన్-వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యజువేంద్ర చాహల్ను జట్టులోకి తీసుకున్నాడు. ఒకరకంగా ఇది అతని డ్రీమ్టీమ్గా చెప్పుకోవచ్చు. ఇవ్వాళ్టి మ్యాచ్ ఇదే కూర్పుతో ఉంటుందనీ అంచనా వేశాడు. రవి బిష్ణోయ్, దీపక్ హుడాలకు అనుభవం సరిపోదని అభిప్రాయపడ్డాడు.