
న్యూఢిల్లీ: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవ్వాళ అయిదు టీ20 మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా.. భారత పర్యటనకు వచ్చింది. తొలి మ్యాచ్ ఇవ్వాళే. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో లేరు. సిరీస్ ఆరంభానికి ముందే కేప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టుకు దూరం అయ్యారు.
కేఎల్ రాహుల్కు బదులుగా రిషబ్ పంత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కేప్టెన్గా అపాయింట్ అయ్యారు. వీరిద్దరి నేతృత్వంలోనే టీమిండియా.. దక్షిణాఫ్రికాతో అయిదు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును ఎదుర్కొనబోయే జాతీయ జట్టుకు నాయకత్వాన్ని వహించే అవకాశాన్ని కేఎల్ రాహుల్ గాయం వల్ల వదులుకోవాల్సి వచ్చింది. ఇది అతన్ని కలచివేసింది.
మ్యాచ్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు.. తన ఆవేదనను పంచుకున్నాడు. తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై కామెట్స్ పోస్ట్ చేశాడు. ప్రతిష్ఠాత్మక సిరీస్కు దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. సొంతగడ్డపై భారత జట్టుకు నాయకత్వాన్ని వహించే అవకాశాన్ని కోల్పోయానని వ్యాఖ్యానించాడు. జట్టు ప్లేయర్లకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని, రిషభ్ పంత్ అండ్ టీమ్.. ఈ సిరీస్లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ తప్పుకోవడం వల్ల జట్టు బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. తుదిజట్టులోకి రుతురాజ్ గైక్వాడ్ లేదా వెంకటేష్ అయ్యర్ను తీసుకోవచ్చు. వారిద్దరికీ కొత్త బంతిని ఎదుర్కొనే సత్తా ఉంది. ఇషాన్ కిషన్తో పాటు ఓపెనర్గా బరిలోకి దిగడానికి రుతురాజ్ గైక్వాడ్ వైపే జట్టు మేనేజ్మెంట్ మొగ్గ చూపొచ్చు. టాప్ ఆర్డర్లో రిషభ్ పంత్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ జట్టు భారీ స్కోర్ చేయగలరు.