
న్యూఢిల్లీ: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవ్వాళ అయిదు టీ20 మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా.. భారత పర్యటనకు వచ్చింది. తొలి మ్యాచ్ ఇవ్వాళే. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో లేరు. సిరీస్ ఆరంభానికి ముందే కేప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టుకు దూరం అయ్యారు. రిషభ్ పంత్ జట్టు సారథ్య బాధ్యతలను అందుకున్నాడు- తాత్కాలికంగా.
మ్యాచ్ పరిస్థితి ఇలావుంటే..అక్కడి వాతావరణం మరోలా ఉంటోంది. ఢిల్లీలో వేడిగాలులు వీస్తోన్నాయి. ఉదయం వేళల్లోనే అక్కడి ఉష్ణోగ్రత 36 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటోంది. మధ్యాహ్నం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య గరిష్ఠంగా 43 నుంచి 44 డిగ్రీలను టచ్ చేస్తోంది ఎండవేడి. కొద్దిరోజులుగా ఇదే తరహా వాతావరణం కనిపిస్తోందక్కడ. పశ్చిమ దిశ నుంచి వేడిగాలులతో ఢిల్లీవాసులు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
దీన్ని అధిగమించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వేడిగాలుల దెబ్బకు ఏకంగా రూల్స్ను మార్చి పడేసింది. తొలి టీ20 మ్యాచ్లో ప్రతి 10 ఓవర్లలకు ఒకసారి డ్రింక్స్ బ్రేక్ ఇవ్వనుంది. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తాము చేసిన ప్రతిపాదనలకు బీసీసీఐ సానుకూలంగా నిర్ణయం తీసుకుందని, ప్రతి 10 ఓవర్లకోసారి డ్రింక్స్ బ్రేక్ ఇవ్వడానికి అంగీకరించిందని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
సాధారణంగా- టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్లల్లో డ్రింక్స్ బ్రేక్స్ ఉండవు. రెండు జట్లు కూడా ఏకధాటిగా 20 ఓవర్లను ఆడేస్తాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్ మాత్రం దీనికి మినహాయింపు. ప్రతి ఆరు ఓవర్లకోసారి టైమ్ అవుట్ ఉంటుంది. ఐపీఎల్ మేనేజ్మెంట్ కమిటీ సొంతంగా తీసుకున్న నిర్ణయం అది. ఇంటర్నేషనల్స్ మ్యాచ్లకు వర్తించదు. ఢిల్లీ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ రూల్స్ను మార్చేసింది బీసీసీఐ.
కాగా 10 ఓవర్లకోసారి డ్రింక్స్ బ్రేక్ అనేది- ఈ ఒక్క మ్యాచ్కే పరిమితం అవుతుందా? లేక.. ఈ సిరీస్ మొత్తానికి అంటే మిగిలిన నాలుగు మ్యాచ్లకూ కొనసాగిస్తుందా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బీసీసీఐ అధికారులు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. కాగా.. రెండో మ్యాచ్ ఒడిశా కటక్లోని బారాబతి స్టేడియంలో షెడ్యూల్ అయింది. మూడో మ్యాచ్ మన విశాఖపట్నంలో ఉంటుంది. నాలుగో మ్యాచ్ రాజ్కోట్, అయిదోది బెంగళూరులో షెడ్యూల్ అయింది.