తొలి 3 ఓవర్లు మెయిడిన్:
దీప్తిశర్మ తొలి టీ20 మ్యాచ్లో 4 ఓవర్లు వేసి.. 3 ఓవర్లు మెయిడిన్ చేసి 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. దీప్తి బౌలింగ్ ఎకానమీ కేవలం 2గా నమోదైంది. దీప్తి దెబ్బకు సఫారీ బ్యాట్స్వుమెన్ వరుసగా పెవిలియన్ చేరారు. దీప్తిశర్మ వేసిన తొలి 3 ఓవర్లు మెయిడిన్ అవ్వడం ఇక్కడ మరో విశేషం. అంటే.. 18 బంతుల్లో సఫారీ బ్యాట్స్వుమెన్ ఒక్క పరుగు కూడా తీయలేదు. అందులో రెండు వికెట్ మెయిడిన్లు ఉన్నాయి.
19వ బంతికి పరుగు:
ఎట్టకేలకు 19వ బంతికి సఫారీ బ్యాట్స్వుమెన్ పరుగు సాధించారు. ఐదో ఓవర్లో దీప్తిశర్మ బ్రిట్స్ (3), డి క్లెర్క్ (0)ను ఔట్ చేసింది. ఇక 14వ ఓవర్లో షబ్నిమ్ ఇస్మాయిల్ (6)ను కూడా తన ఖాతాలో వేసుకుంది. చివరి ఓవర్లోనే దీప్తి 8 పరుగులు ఇచ్చింది. కీలక వికెట్లు తీసి సఫారీలను కష్టాల్లోకి నెట్టిన దీప్తిశర్మ (3/8)కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
షఫాలీ వర్మ అరంగేట్రం:
తొలి టీ20లో హర్యానా సంచలనం షఫాలీ వర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. దీంతో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన రెండో పిన్న వయస్కురాలిగా షఫాలీ వర్మ (15 ఏళ్ల 239 రోజులు) గుర్తింపు పొందింది. గతంలో గార్గి బెనర్జీ 14 ఏళ్ల 162 రోజుల వయసులో (1978లో) భారత్కు వన్డేలో ప్రాతినిధ్యం వహించింది. అయితే అరంగేట్ర మ్యాచ్లో షఫాలీ వర్మ నాలుగు బంతులను ఎదుర్కొని డకౌట్ అయింది.
స్పిన్ అస్రంతో దెబ్బ:
సూరత్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 130/8 పరుగులే చేసింది. హర్మన్ప్రీత్ (43), స్మృతి మంధాన (21) టాప్ స్కోరర్లు. సులభ లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలను టీమిండియా బౌలర్లు తమ స్పిన్ అస్రంతో దెబ్బకొట్టారు. కట్టుదిట్టంగా బంతులు వేస్తూ.. కీలక సమయంలో వికెట్లు తీస్తూ 119 పరుగులకే పరిమితం చేశారు. డు ప్రీజ్ (59) మినహా మరెవ్వరూ రాణించలేదు. దీప్తిశర్మ 3 వికెట్లు తీసింది.