టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ మరో ఘన విజయం సాధించింది. నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్తో జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో మందకొడి పిచ్పై బ్యాటర్లు తడబడినా భారత బౌలర్లు గొప్పగా రాణించి జట్టును గెలిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (42; 31 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్.
పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా (3/21), హారిస్ రవూఫ్ (3/21) చెరో మూడు వికెట్లు, మహ్మద్ అమీర్ (2/23) రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. బుమ్రా (3/14) మూడు, హార్దిక్ పాండ్య రెండు (2/24), అర్షదీప్ (1/31), అక్షర్ పటేల్ (1/11) చెరో వికెట్ తీశారు. మహ్మద్ రిజ్వాన్ (31; 44 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) పోరాడాడు.

టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్పై భారత్కు ఇది ఏడో విజయం. ఇరు జట్లు ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ల్లో తలపడగా టీమిండియాదే పైచేయి. కాగా, మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తమ జట్టు ఓటమికి గల కారణాలు వివరించాడు. అతిగా డాట్ బాల్స్ ఆడటంతో మ్యాచ్ను కోల్పోయామని అన్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు తీవ్ర చర్చనీయాంశంగా మారిన పిచ్ గురించి మాట్లాడుతూ.. పిచ్ బాగానే ఉందని, ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపాడు. అయితే కొన్నిబంతులు ఎక్స్ట్రా బౌన్స్ వచ్చాయని పేర్కొన్నాడు.
''మేం బౌలింగ్లో సత్తాచాటాం. కానీ బ్యాటింగ్లో విఫలమయ్యాం. వరుసగా వికెట్లు కోల్పోవడం, అధికంగా డాట్ బాల్స్ ఆడటం ప్రతికూలంగా మారింది. ఛేదన కోసం ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగలేదు. సింపుల్గా నార్మల్గా ఆడాలనుకున్నాం. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీ సాధించాలనుకున్నాం. కానీ ఈ ప్రక్రియలో డాట్ బాల్స్ ఎక్కువగా ఎదుర్కొన్నాం. ఛేదనలో టెయిలెండర్ల నుంచి పెద్దగా ఆశించలేదు''
''పవర్ప్లేను వీలైనంత ఎక్కువగా ఉపయోగించాలనుకున్నాం. కానీ ఓ వికెట్ పడగానే పరిస్థితి మారిపోయింది. తొలి ఆరు ఓవర్లలో మా మార్క్ను చూపించలేకపోయాం. పిచ్ విషయానికొస్తే..ఇది బాగుంది. బంతి మంచిగానే వస్తుంది. కానీ కాస్త స్లోగా ఉంది. కొన్ని బంతులు ఎక్స్ట్రా బౌన్స్ వచ్చాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం. కూర్చొని మా తప్పుల గురించి విశ్లేషించుకుంటాం'' అని బాబర్ అజామ్ అన్నాడు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే.