టీ20 వరల్డ్ కప్లో మహా సంగ్రామానికి వేళైంది. క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్లోని నాసా కౌంటీ క్రికెట్ స్టేడియంలో మరికాసేపట్లో ఈ హై వోల్టేజ్ వార్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై సునాయాసంగా గెలిచిన టీమిండియా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
మరోవైపు పాకిస్థాన్ది దీన గాథ. పసికూన అమెరికా చేతిలో కంగుతిని సొంత అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ డీలా పడింది. తిరిగి పుంజుకుని భారత్పై గెలవాలని పట్టుదలతో ఉంది. కాగా, టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడుతూ.. అజామ్ ఖాన్ స్థానంలో ఇమాద్ వసీమ్ తుదిజట్టులోకి వచ్చాడని చెప్పాడు.

వాతావరణ పరిస్థితులు, పిచ్పై ఉన్న తేమను దృష్టిలో ఉంచుకుని బౌలింగ్ ఎంచుకున్నామని బాబర్ పేర్కొన్నాడు. తమ అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తామని, అమెరికా చేతిలో ఓటమి గురించి ఆలోచించట్లేదని తెలిపాడు. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నామని అన్నాడు. అజామ్ ఖాన్కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.
అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. జైస్వాల్, శాంసన్, కుల్దీప్, చాహల్ను మరోసారి బెంచ్కే పరిమితం చేస్తున్నట్లు తెలిపాడు. ఐర్లాండ్తో ఆడిన తుది జట్టునే కొనసాగించాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. అయితే టాస్ గెలిస్తే తాము కూడా తొలుత బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని అన్నాడు. మంచి స్కోరు సాధించి డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తామని రోహిత్ పేర్కొన్నాడు.
తుది జట్లు
టీమిండియా: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్
పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్, ఉస్మాన్ ఖాన్, ఫకర్ జమాన్, షాదబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, హారిస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.