క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్ వేదికగా మరికొన్ని గంటల్లో ఈ హై వోల్టేజ్ వార్ ప్రారంభం కానుంది. పొట్టి కప్లో చిరకాల ప్రత్యర్థిపై 6-1తో ఉన్న రికార్డును 7-1గా మార్చాలని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో రోహిత్ సేనే హాట్ ఫేవరేట్ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు సైతం పేర్కొనడం విశేషం.
అయితే భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి పేరు నెట్టింట ట్రెండింగ్లోకి వచ్చింది. ఐపీఎల్లోని ఫ్రాంచైజీలన్నీ కోహ్లి ఘనతలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి. కాగా, టీ20ల్లో పాకిస్థాన్పై విరాట్ కోహ్లికి అసాధారణ రికార్డులు ఉన్నాయి. ప్రపంచకప్ చరిత్రలో ఇతర జట్లపై మరే ఆటగాడికి సాధ్యం కానీ రికార్డులు రన్ మెషిన్ పేరిట ఉన్నాయి.

టీ20 వరల్డ్ కప్లో భారత్-పాకిస్థాన్ ఏడు సార్లు తలపడ్డాయి. బౌల్ అవుట్తో కలిపి టీమిండియా ఆరు సార్లు నెగ్గగా, పాక్ 2021లో ఒక్కసారి గెలిచింది. అయితే ఈ మెగాటోర్నీలో పాకిస్థాన్తో కోహ్లి అయిదు మ్యాచ్లు ఆడగా ఏకంగా మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం విశేషం. పొట్టి కప్లో పాక్పై ఈ అవార్డు అత్యధిక సార్లు అందుకున్న ఆటగాడిగా కోహ్లి రికార్డు సాధించాడు. అంతేగాక ఈ అయిదు మ్యాచ్ల్లో భారత్ తరఫున టాప్ స్కోరర్ కోహ్లినే.
2007లో గ్రూప్ స్టేజ్లో మహ్మద్ అసిఫ్, ఫైనల్లో ఇర్ఫాన్ పఠాన్, 2014లో అమిత్ మిశ్రా, 2021లో షాహిన్ అఫ్రిది ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. 2012, 2016, 2022 ప్రపంచకప్ల్లో విరాట్ కోహ్లి సాధించాడు. కాగా, కోహ్లి అయిదు ఇన్నింగ్స్ల్లో పాకిస్థాన్పై 308 సగటుతో 308 పరుగులు చేశాడు. దీనిలో నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. పాక్పై 78 నాటౌట్, 36 నాటౌట్, 55 నాటౌట్, 57, 82 నాటౌట్తో పరుగులు చేశాడు. ప్రపంచకప్లో పాకిస్థాన్పై 300+ సగటు కలిగి ఉన్న ఏకైక బ్యాటర్గా కోహ్లి చరిత్రలో నిలిచాడు. అదే జోరును ఇవాళ మ్యాచ్లోనూ ప్రదర్శించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.