
హైదరాబాద్: ఆదివారం జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తిని చాటారు. పోరాటమేదైనా ఆటలోనే కానీ ఒక్కసారి మ్యాచ్ ముగిశాక అందరం ఒక్కటే అని చాటి చెప్పారు. గెలుపు కోసం చేసే పోరాటంలో భావోద్వేగాలు మైదానం వరకే పరిమితమని భారత్-పాక్ ప్లేయర్స్ నిరూపించారు. పాక్ విజయం సాధించాక క్రీజులో ఉన్న ఓపెనర్లు మొహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ష్యేక్ హాండ్ ఇచ్చాడు. రిజ్వాన్ను అయితే మనస్ఫూర్తిగా అభినందించాడు. ఆడేటప్పుడు మాత్రమే గెలుపోటములు, వ్యూహప్రతివ్యూహాలు.. ఆట ముగిశాక అంతా సోదరభావమే అని కోహ్లీ ఇలా చాటిచెప్పాడు.
ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా మెంటర్ ఎంఎస్ ధోనీ.. పాకిస్తాన్ ఆల్రౌండర్ ఇమాద్ వసీమ్, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, ప్రస్తుత కెప్టెన్ బాబర్ అజమ్తో సంభాషించాడు. వారికి అభినందనలు తెలిపాడు. అదే సమయంలో కొన్ని విలువైన సూచనలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. దుబాయ్లో మ్యాచ్ తర్వాత అనేక మంది పాకిస్తాన్ ఆటగాళ్లతో ధోనీ మాట్లాడుతున్న వీడియోను ఐసీసీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. 'బయట ఎన్ని అపోహలు ఉన్నా.. ఇది భారత్-పాకిస్తాన్ జట్ల నిజమైన క్రికెట్ ఇదే' అని ఐసీసీ పేర్కొంది. #SpiritOfCricket #T20WorldCup అనే హ్యాష్ టాగ్ ఇచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన కోహ్లీ, ధోనీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు అభిమానులు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగుల సాధారణ స్కోర్ చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ (0) షహీన్ షా ఆఫ్రిది బౌలింగ్లో డకౌటయ్యాడు. ఆపై మూడో ఓవర్లో లోకేష్ రాహుల్ పెవిలియన్ చేరాడు. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (11) సైతం ఔటవ్వడంతో భారత్ 31 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (57; 49 బంతుల్లో 5x4, 1x6), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (39; 30 బంతుల్లో 2x4, 2x6) పోరాడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. చివర్లో ధాటిగా ఆడతారనుకున్న రవీంద్ర జడేజా (13), హార్దిక్ పాండ్యా (11) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
భారత్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన పాకిస్థాన్.. బ్యాటింగ్లోనూ అదే జోరు కొనసాగించింది. సొంతగడ్డలాంటి దుబాయ్ పిచ్పై పాక్ ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే వేగంగా ఆడారు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో 4, 6తో మొహ్మద్ రిజ్వాన్ (79; 55 బంతుల్లో 6x4, 3x6) దంచుడు షురూ చేశాడు. బాబర్ అజామ్ (68; 52 బంతుల్లో 6x4, 2x6) కూడా ధాటిగానే ఆడాడు. తొలి నాలుగు ఓవర్లను నలుగురు వేర్వేరు బౌలర్లతో వేయించినా.. భారత్కు ఒక్క వికెట్ దక్కలేదు. మంచి బంతులను ఆచితూచి ఆడిన పాక్ ఓపెనర్లు.. చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. భారత బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోవడంతో పాక్ ఓపెనర్లు ఆడుతూ పాడుతూ పరుగులు చేశారు. దాంతో మరో 13 బంతులు మిగిలుండగానే పాక్ విజయాన్ని అందుకుంది.