Viral Video: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం. స్టేడియంలో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. తాజాగా అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్ పోరులో కూడా అచ్చం ఇలాంటి దృశ్యమే కనిపించింది. టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
అసలేం జరిగిందంటే?
పాకిస్థాన్ నిర్దేశించిన 347 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ ఆరంభించింది. టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే భారత స్కోరు 49 పరుగుల వద్ద ఉండగా.. వైభవ్ సూర్యవంశీ అయ్యాడు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్లో ఉన్న వైభవ్ వికెట్ పడటంతో పాక్ ఆటగాళ్లు అత్యుత్సాహంతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

కోపం తట్టుకోలేకపోయిన వైభవ్.. 'షూ' చూపిస్తూ కౌంటర్!
వైభవ్ సూర్యవంశీ ఔట్ అయ్యాక సైలెంట్గా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న సమయంలో ఓ పాక్ ఆటగాడు అతడిని ఉద్దేశించి ఏదో కామెంట్ చేశాడు. దీంతో వైభవ్ సూర్యవంశీకి చిర్రెత్తుకొచ్చింది. వెనక్కి తిరిగిన వైభవ్.. పాక్ జట్టు వైపు చూస్తూ తన 'షూ'ను చూపించాడు. అంటే "మీరు నా కాలి కింద ధూళితో సమానం" అన్నట్టుగా అతను సైగ చేయడం మైదానంలో కలకలం రేపింది. అంపైర్లు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
వైభవ్ మెరుపు ఇన్నింగ్స్
ఈ మ్యాచ్లో వైభవ్ తక్కువ సేపు క్రీజులో ఉన్నా, పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 260.00 స్ట్రైక్ రేట్తో 10 బంతుల్లో 26 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్లో ఒక ఫోర్, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ 176.69 స్ట్రైక్ రేట్తో మొత్తం 235 పరుగులు చేసి భారత బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచాడు. ఒకవేళ అతను మరో 5-10 ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే పాకిస్థాన్కు ఓటమి ఖాయమయ్యేది. అందుకే అతని వికెట్ తీశాక పాక్ ప్లేయర్లు అంతగా రెచ్చిపోయారు.