IND vs PAK: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో దాయాదుల పోరు హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే నిర్ణయం తలకిందులైంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 347 పరుగుల భారీ స్కోరును సాధించింది. భారత్ ముంగిట 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ దుబాయ్ స్టేడియంలో పరుగుల వరద పారించాడు. టీమిండియా బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో ఆడుకున్న సమీర్.. కేవలం 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. సమీర్ మిన్హాస్ మొత్తంగా 113 బంతుల్లో 172 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు బాదాడు. ఆరంభం నుంచే టీమిండియాపై ఎదురుదాడి చేస్తూ కేవలం 71 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో శతకాన్ని అందుకున్నాడు. ఈ టోర్నీలో సమీర్కు ఇది రెండో సెంచరీ. ఇంతకుముందు మలేషియాపై కూడా అతను 177 పరుగులతో విరుచుకుపడ్డాడు.
పాకిస్థాన్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ (35), అహ్మద్ హుస్సేన్(56), పాక్ కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్(19) సమీర్కు తోడుగా నిలిచారు. పాకిస్థాన్ ఓపెనర్ హమ్జా జహూర్ 18 పరుగులకే ఔట్ కాగా.. ఆ తర్వాత సమీర్ మిన్హాస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్కు సమీర్ చుక్కలు చూపించాడు. భారత బౌలర్లు కొత్త బంతితో వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమయ్యారు. హమ్జా జహూర్తో కలిసి సమీర్ 31 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఉస్మాన్ ఖాన్తో కలిసి 92 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించాడు. అహ్మద్ హుస్సేన్తో కలిసి భారత బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ మరో శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

భారత బౌలర్ల నిస్సహాయత
సమీర్ మిన్హాస్ ఇన్నింగ్స్తో పాకిస్థాన్ పటిష్ట స్థితికి చేరుకుంది. భారత బౌలర్ల పాక్ బ్యాటర్లను అంతగా కట్టడి చేయలేకపోయారు. ఇప్పుడు భారత బ్యాటర్లు ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ. అభిజ్ఞాన్ కుందు ఈ భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తారో చూడాలి. 12వ సారి టైటిల్ నెగ్గాలంటే భారత్ అసాధారణ పోరాటం చేయాల్సి ఉంటుంది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. కనిష్క్ చౌహాన్కు ఒక వికెట్ లభించింది.