
పాక్ విజయం ఖాయం అనుకున్నా
టీమిండియాతో జరుగనున్న మ్యాచుకు ముందు పాకిస్తాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భారీ స్కోర్ చేసినా పాక్ జట్టుకు ఓటమి తప్పలేదు. స్టార్ పేసర్ హాసన్ అలీ చేజేతులారా మ్యాచును పోగొట్టాడు. దక్షిణాఫ్రికా విజయానికి చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు అవసరం అయ్యాయి. 19వ ఓవర్ వేసిన షహీన్ షా అఫ్రిది.. 10 పరుగులు ఇచ్చాడు.
అఫ్రిది రెండు ఫోర్లు ఇచ్చినా.. అవి బ్యాట్ అంచును తాకి అనూహ్యంగా బౌండరీ వెళ్లాయి. ఇక చివరి ఓవర్లో ప్రొటీస్ విజయానికి 19 పరుగులు అవసరం అవ్వడంతో పాక్ విజయం ఖాయం అనుకున్నారు. కానీ బంతిని అందుకున్న హాసన్ అలీ ఏకంగా 22 పరుగులు ఇచ్చాడు. అలీ రెండు సిక్సులు, రెండు ఫోర్లు ఇచ్చి పాక్ ఓటమికి కారకుడయ్యాడు.

తీవ్ర నిరాశకు లోనైన ఫాన్స్
టీమిండియాతో మ్యాచుకు ముందు పాకిస్తాన్ ఇలా ఓడిపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. సోషల్ మీడియాలో పాక్ జట్టును నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. 'బాబర్ ఆజామ్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు' అని ఒకరు కామెంట్ చేయగా.. '19 పరుగులను కూడా కాపాడలేకపోయిన కెప్టెన్' మరొకరు కామెంట్ చేశారు. వాన్డెర్ డుసెన్ (51 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీ చేయడంతో ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన వామప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 186/6 స్కోరు చేసింది. ఫఖర్ జమాన్ (51), ఆసిఫ్ అలీ (32) రాణించారు. రబాడ (3/28) మూడు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 190/4 స్కోరు చేసి గెలిచింది.

వార్నింగ్ ఇచ్చిన అలీ
ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియాకు హాసన్ అలీ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తాము ఓడించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, అదే ప్రదర్శనను అక్టోబర్ 24న దుబాయ్లో జరిగే మ్యాచులో కనబరుస్తామన్నాడు. '2017లో భారత్ని ఓడించి మేం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం.
అందరూ ఆ విషయాన్ని గుర్తుచుకోవాలి. అదే స్ఫూర్తితో టీ20 ప్రపంచకప్లో కూడా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచులపై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. సాధారణంగా క్రికెట్ మ్యాచులు చూడని అభిమానులు కూడా ఈ పోరుపై ఎంతో ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి భారత్తో తలపడటం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఆటగాళ్లపై కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. అయినా మెరుగ్గా రాణించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. అందుకోసం ప్రణాళికలు రచిస్తున్నాం' అని అలీ అన్నాడు.

ఐసీసీ టోర్నీల్లోనే
గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్లో తొలి మ్యాచ్ జరగనుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. దాంతో ఈ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాదీ జట్లు తలపడుతున్నాయి.
చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్లో పాక్ పర్యటించింది. 2008లో ఆసియా కప్ కోసం టీమిండియా.. పాక్కు వెళ్లింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు భారత్తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 2018 ఆసియా కప్, 2019 వన్డే ప్రపంచకప్ పోరులో దాయాది దేశం పరాజయం పాలయ్యింది. మరి ఇప్పుడు ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

భారత్దే పై చేయి
పాకిస్థాన్పై ఏ ఫార్మాట్లోనైనా భారత్కే మెరుగైన రికార్డ్ ఉంది. ప్రపంచకప్లో ఇప్పటి వరకూ 7 సార్లు భారత్, పాక్ ఢీకొనగా.. అన్ని మ్యాచ్ల్లోనూ టీమిండియానే గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్లో మొత్తం 5 సార్లు తలపడగా నాలుగుసార్లు భారత్ గెలవగా.. ఒక్కసారి డ్రా అయింది. ఇక మ్యాచ్ల పరంగా మాత్రం పాక్దే పైచేయి. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 59 టెస్ట్లు జరగ్గా.. పాక్ 12 సార్లు గెలవగా, భారత్ 9 సార్లే విజయం సాధించింది.
38 మ్యాచ్ల ఫలితం తేలలేదు. 132 వన్డేల్లో 73 పాక్ గెలవగా.. భారత్ 55 మాత్రమే విజయం సాధించింది. 4 మ్యాచ్లు టై అయ్యాయి. ఇక టీ20ల్లో ఇరు జట్లు 8 మ్యాచ్లు ఆడగా.. భారత్ అత్యధికంగా 6 సార్లు విజయం సాధించగా, పాక్ ఒకేసారి గెలుపొందింది. మరొక మ్యాచ్ డ్రా అయింది.


Click it and Unblock the Notifications












