నోరు జారిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ విరుచుకుపడ్డాడు. ట్విటర్ వేదికగా కమ్రాన్ను కడిగిపారేశాడు. వెంటనే తన తప్పును గ్రహించుకున్న కమ్రాన్ అక్మల్ భజ్జీకి, సిక్కుల కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పాడు. బాధపెట్టాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని పాక్ క్రికెటర్ వివరణ ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే.. ఇటీవల జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను ఉద్దేశిస్తూ ఓ న్యూస్ ఛానెల్లో కమ్రాన్ అక్మల్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అర్షదీప్ సింగ్ను అవమానిస్తూ, సిక్కు మతం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. దీనిపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. సిక్కుల గురించి నోరుజారక ముందే చరిత్ర తెలుసుకోవాలని, చేసిన మేలు గుర్తుంచుకోవాలని మండిపడ్డాడు.

''నోరుజారక ముందే సిక్కుల చరిత్ర తెలుసుకోవాలి. మీ తల్లులు, సోదరీమణులను ఆక్రమణదారులు అపహరించినప్పుడు సిక్కులమైన మేమే రక్షించాం. మీరు సిగ్గుపడాలి. సిక్కుల పట్ల కాస్త కృతజ్ఞత కలిగి ఉండండి'' అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. దీనికి కమ్రాన్ అక్మల్ బదులిస్తూ ట్విటర్ వేదికగానే క్షమాపణలు చెప్పాడు.
''ఇటీవల నేను చేసిన వ్యాఖ్యల గురించి ఎంతో బాధపడుతున్నాను. హర్భజన్ సింగ్, సిక్కు కమ్యూనిటికీ క్షమాపణలు చెబుతున్నాను. నా వ్యాఖ్యలు అగౌరవంగా, తప్పుగా ఉన్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశంతో అనలేదు. నన్ను క్షమించండి'' అని కమ్రాన్ అక్మల్ అన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పాకిస్థాన్పై భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవరల్లో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (42; 31 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా (3/21), హారిస్ రవూఫ్ (3/21) చెరో మూడు వికెట్లు, మహ్మద్ అమీర్ (2/23) రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. బుమ్రా (3/14) మూడు, హార్దిక్ పాండ్య రెండు (2/24), అర్షదీప్ (1/31), అక్షర్ పటేల్ (1/11) చెరో వికెట్ తీశారు. మహ్మద్ రిజ్వాన్ (31; 44 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) పోరాడాడు.