
ఇస్లామాబాద్: భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజామామ్ ఉల్ హక్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన టీ20 జట్టు అని, టీ20 ప్రపంచకప్ 2021లో కోహ్లీసేన ఛాంపియన్గా నిలవడం ఖాయం అని పేర్కొన్నాడు. యూఏఈలోని పరిస్థితులు, టీ20 ఫార్మాట్లో ఆటగాళ్ల అనుభవం.. ఇలా ఏ విధంగా చూసిన టీమిండియా ఛాంపియన్ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంజీ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మెగా మ్యాచ్ కోసం ఫాన్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో పాక్ మాజీ సారథి ఇంజామామ్ ఉల్ హక్ మాట్లాడుతూ... 'ఏ టోర్నమెంట్లోనైనా ఫలానా జట్టు కచ్చితంగా విజేతగా నిలుస్తుందని కచ్చితంగా చెప్పలేం. విజయం సాధించడం అనేది ఆ జట్టు అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. నా అంచనా ప్రకారం.. ఈ టీ20 ప్రపంచకప్లో ఛాంపియన్గా నిలిచే అవకాశాలు ఇతర జట్ల కంటే భారత జట్టుకే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా యూఏఈ పరిస్థితులు భారత ఆటగాళ్లకు బాగా అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుత టీమిండియాలో అనుభవజ్ఞులైన టీ20 ఆటగాళ్లున్నారు. అంతేకాదు వారు మంచి ఫామ్లో ఉన్నారు. ఐపీఎల్ 2021లో ఎలా ఆడారో మనం చూసాం. టీ20 ప్రపంచకప్లో భారత ప్లేయర్స్ రాణించే అవకాశాలు ఉన్నాయి' అని అన్నాడు.
ఆదివారం (అక్టోబరు 24) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై హోల్టెజీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ గురించి ఇంజామామ్ ఉల్ హక్ స్పందించాడు. 'సూపర్ 12 దశలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫైనల్కు ముందు ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్కు ఉన్నంత క్రేజ్ మరే మ్యాచ్కు ఉండదు. ఎప్పటినుంచో ఇదే కొనసాగుతుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్లు ఫైనల్స్ను తలపించాయి. ఇప్పుడు కూడా మరోసారి ఉత్కంఠంగానే జరిగే అవకాశం ఉంది' అని ఇంజామామ్ అంచనా వేశాడు.
బుధవారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన సన్నాహక మ్యాచ్ గురించి పాక్ మాజీ సారథి మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత్ ఎలాంటి చింత లేకుండా ఆడింది. 155 పరుగుల లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ అవసరం లేకుండానే ఛేదించింది. టీ20ల్లో ఇలాంటి ఉపఖండ పిచ్లపై భారత్ అత్యంత ప్రమాదకరమైన జట్టు' అని ఇంజామామ్ ఉల్ హక్ ప్రశంసించాడు. భారత్ రెండు సన్నాహక మ్యాచులలో గెలుపొందగా.. పాక్ ఒకదాంట్లో ఓడి మరొకదాంట్లో గెలిచింది. మొదటి వార్మప్ మ్యాచ్లో వెస్టిండీస్ని ఓడించి పాకిస్థాన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్లో ఓటమిపాలైంది. భారత్తో మ్యాచ్కు ముందు పాక్కు ఇది గట్టిదెబ్బగానే చెప్పవచ్చు.