
హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. రోమాలు నిక్కబొడుచుకునే ఉత్కంఠ క్షణాలకు.. నరాలు తెగే ఉద్వేగభరిత సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి మహా సంగ్రామానికి దుబాయ్ అంతర్జాతీయ మైదానం వేదిక కానుంది. టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12 తొలి మ్యాచ్లో భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆదివారం (అక్టోబర్ 24) రాత్రి అమీతుమీ తేల్చుకోనుంది. స్టేడియంలో ఇండియన్ ప్లేయర్ బౌండరీ కొడితే.. స్టాండ్స్లో ఫ్యాన్స్ ఊగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సిక్స్ కొడితే కేకలతో హోరెతిట్టించేందుకు రెడీగా ఉన్నారు. ఇక పిచ్లో ప్రత్యర్ధి వికెట్ పడితే.. దేశంలో అభిమానులు చిందులేయాడని రెడీ అవుతున్నారు. మొత్తానికి భారత అభిమానులకు ఈ పండగే అని చెప్పాలి.
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మాములు మ్యాచ్ జరుగుతుందంటనే.. ఫాన్స్ సందడి, హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది ప్రపంచకప్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే.. ఆ ఉత్కంఠను మాటల్లో చెప్పలేం. ఆ సంతోషంను వివరించలేం. ఈ క్రమంలోనే భారత దేశంను క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. సూపర్ సండే రోజు మ్యాచ్ చూసేందుకు అభిమానులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక మ్యాచ్ దుబాయ్లోనే జరుగుతున్నా.. ఇక్కడ జరుగుతుందనే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు కొందరు ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థల నిర్వాహకులు. బిగ్ స్క్రీన్స్, ప్రొజెక్టర్లతో ప్రత్యేకంగా స్క్రీనింగ్స్ని ఏర్పాటు చేస్తుంటే.. సిటీలోని కొన్ని పబ్స్, మాల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ క్రికెట్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసేలా ఫుడ్ అండ్ డ్రింక్స్పై ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. మరోవైపు ఫుడ్ డెలివరీ యాప్లు కూడా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
దాయాది జట్లు ఎన్నిసార్లు పోటీపడినా టీమిండియానే గెలవాలనే ఆకాంక్షతో దేశంలో లక్షలాది మంది ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. శనివారం నుంచే దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం భారత క్రికెట్ జట్టు అభిమానులు గంగా ఆరతి సమయంలో దీప మాలలతో అలంకరించి భారత జట్టు కోసం ప్రార్థించారు. అదే సమయంలో ప్రజలందరూ కూడా టీమిండియా చిత్రాన్ని తమ చేతిలో ఉంచుకుని.. భారత జట్టు విజయం కోసం ప్రార్థించారు. ఇక కర్ణాటకలో అయితే ఫాన్స్ తమ ఇళ్లలో ప్రత్యేకంగా పూజలు చేయించారు. 'వి విల్ విన్ టీ20 ప్రపంచకప్ 2021' అని బ్యానర్ పెట్టి మరి పూజలు చేశారు. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. రచ్చ మాములుగా లేదుగా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
భారత్, పాకిస్తాన్ జట్లు విజయంతో టోర్నీని ఆరంబించాలని చూస్తున్నాయి. టీమిండియా తమ రెండు వార్మప్ మ్యాచ్లలో విజయం సాధించింది. తొలి వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్పై, రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియాపై కోహ్లీసేన విజయం సాధించగా.. పాక్ జట్టు ఒక మ్యాచ్లో గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోయింది. విండీస్తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్లో బాబర్ సేన విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కారణంగా గత కొంతకాలంగా ఇరు జట్లు పరస్పరం ద్వైపాక్షిక సిరీస్లు ఆడడం లేదు. 2019లో వన్డే ప్రపంచకప్లో చివరిసారిగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ భారీ తేడాతో ఓడిపోయింది.