IND vs PAK: శ్రీలంకలో జరిగిన ఐసీసీ అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ 2025లో భారత జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంధుల మహిళా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఓ కీలక మైలురాయిగా నిలిచింది. క్రీడల్లో గెలుపోటముల కంటే మానవత్వమే ముఖ్యమని చాటుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల క్రికెట్ జట్లు మైదానంలో కలుసుకుని కరచాలనం చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ సంఘటన దెబ్బతిన్న దాయాదుల సంబంధాలలో సానుకూల సంకేతంగా పరిగణించవచ్చు.
శ్రీలంకలో జరుగుతున్న అంధుల మహిళల T20 ప్రపంచ కప్ 2025లో భాగంగా కొలంబో వేదికగా ఈ ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 135 పరుగులకే ఆలౌటైంది. ఆరంభంలోనే 23 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ.. మెహ్రీన్ అలీ(66), బుష్రా అష్రఫ్(44 ) పరుగులు చేసి పాక్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. అయితే భారత ఫీల్డింగ్ అద్బుతంగా ఉంది. పాక్ జట్టుకు చెందిన ఏడుగురు ఆటగాళ్లను రనౌట్ చేయడం గమనార్హం.

అనంతరం ఛేదనలో భారత అంధుల మహిళా జట్టు కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ దీపికా టీసీ 45 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చింది. అనెఖా దేవి కేవలం 64 పరుగులతో నాటౌట్గా నిలిచి అద్భుతమైన ప్రదర్శనతో భారత్కు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందించింది. ఈ ప్రదర్శనకు గాను ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో టోర్నమెంట్లో భారత్కు ఇది వరుసగా ఐదో విజయం కావడం విశేషం.
క్రీడా స్ఫూర్తిని చాటిన కరచాలనం
గత కొన్నేళ్లుగా భారత్-పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు క్రీడా సంబంధాలపైనా ప్రభావం చూపాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆసియా కప్ 2025లో భారత పురుషుల టీమ్ పాకిస్తాన్తో మ్యాచ్ల సమయంలో షేక్హ్యాండ్ చేయలేదు. మహిళల ప్రపంచ కప్ 2025లో కూడా భారత మహిళా జట్టు పాకిస్తాన్తో కరచాలనం చేయలేదు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి.
అయితే, ఈ సంప్రదాయానికి విరుద్ధంగా, తాజాగా జరిగిన అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ అనంతరం భారత్, పాకిస్తాన్ మహిళా అంధుల క్రికెట్ జట్లు ఒకరినొకరు కలుసుకుని, మనస్ఫూర్తిగా కరచాలనం చేసుకున్నారు. టాస్ సమయంలో కరచాలనం చేయకపోయినా, మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా దెబ్బతిన్న సంబంధాలను తాత్కాలికంగానైనా పక్కనపెట్టి, మానవ బంధాలకు ప్రాధాన్యతనిచ్చాయి. ఈ కరచాలనం కేవలం క్రీడా సంఘటన మాత్రమే కాదు, కఠిన రాజకీయ పరిస్థితుల మధ్య కూడా శాంతి, స్నేహానికి క్రీడలు వేదికగా నిలవగలవని ప్రపంచానికి చాటిచెప్పింది.