
ముంబై: టీ20 ప్రపంచకప్ 2021 తొలి మ్యాచ్లోనే టీమిండియాకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. ఆదివారం రాత్రి దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగుల స్కోర్ చేయగా.. పాక్ మరో 13 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమయిన కోహ్లీసేన మూల్యం చెల్లించుకుంది. పాక్ చేతిలో భారత్ ఓటమికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచ్పై తన విశ్లేషణను పంచుకున్నాడు.
ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేసిన సచిన్ టెండూల్కర్ భారత్ ఓటమికి గల కారణాలను ఇలా చెప్పుకొచ్చాడు. 'ఈ మ్యాచ్లో పాకిస్థాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నా.. భారత్ ఇంచుమించు 20-25 పరుగులు తక్కువ స్కోర్ చేసింది. ముఖ్యంగా షహీన్ షా అఫ్రిది వేసిన అప్ ఫ్రంట్ బంతులను ఎదుర్కొనే సమయంలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సరైన ఫుటవర్క్తో కనిపించలేదు. అఫ్రిది గంటకు 140కిమీ వేగంతో బంతులు విసురుతుంటే.. భారత బ్యాటర్లు అందుకు తగ్గట్టు క్రీజులో లేరు. పాక్ తమ బౌలర్లను కచ్చితమైన ప్రణాళికతో సమర్థవంతంగా వినియోగించుకుంది. అవసరాలకు తగ్గట్టు బౌలింగ్ ఛేంజెస్ చేసింది' అని సచిన్ చెప్పాడు.
'భారత్ చాలా రోజులుగా పాకిస్థాన్తో మ్యాచ్లు ఆడలేదు. దీంతో పాక్ జట్టును అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఈ క్రమంలోనే భారత్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ రెండు షాట్లు బాగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ భాగస్వామ్యం నిర్మించాలని చూసినా.. అవసరమైనంత ధాటిగా ఆడలేదు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం భారత్ అవకాశాలను దెబ్బ తీసింది. ఇక పాక్ ఆడేటప్పుడు భారత్ ఆదిలోనే వికెట్లు తీయలేకపోయింది. భారత్ కూడా పాక్ మల్లే ఆదిలోనే వికెట్లు తీసుంటే.. పరిస్థితులు మరోలా ఉండేవి. పాక్ బ్యాటర్లు ఒత్తిడిలోకి వెళ్లేవారు. భారత బ్యాటింగ్ సమయంలో పాకిస్థాన్ అదే చేసింది' అని సచిన్ పేర్కొన్నాడు.
పాక్ ఓపెనర్లు మొహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ టీమిండియాపై ఒత్తిడి తెచ్చారని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. తేలికైన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూనే సింగిల్స్, డబుల్స్తో ఇన్నింగ్స్ను నిర్మించారన్నాడు. అయితే భారత్ కీలక సమయాల్లో ఒత్తిడి పెంచి పైచేయి సాధించే అవకాశాలు వచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందని సచిన్ వివరించాడు. భారత బ్యాటర్లు ఓఫలమయిన అదేచోట మొహ్మద్ రిజ్వాన్ (79; 55 బంతుల్లో 6x4, 3x6), బాబర్ అజామ్ (68; 52 బంతుల్లో 6x4, 2x6) హాఫ్ సెంచరీలు చేసి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.