మహిళల టీ20 ప్రపంచకప్-2024లో హైవోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా భారత్ - పాకిస్థాన్ తలపడనున్నాయి. సెమీఫైనల్స్కు అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్లో తప్పక విజయం సాధించాలి. బలాబలాల, రికార్డుల పరంగా పాకిస్థాన్పై భారత్దే పైచేయి. అదే జోరు కొనసాగిస్తే పాక్ను చిత్తు చేయడం హర్మన్ప్రీత్ సేనకు కష్టమేమి కాదు.
అయితే న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమితో భారత మహిళల జట్టు నిరాశలో ఉంది. మరోవైపు ఆసియా ఛాంపియన్స్ శ్రీలంకను ఓడించిన ఉత్సాహంలో పాకిస్థాన్ ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా గొప్పగా పుంజుకుని పాకిస్థాన్కు చెక్ పెట్టాల్సి ఉంది. టీ20 ఫార్మాట్లో ఇరు జట్లు 15 సార్లు తలపడగా భారత్ 12 సార్లు నెగ్గింది. మూడింట్లో ఓటమిపాలైంది. ఇక టీ20 వరల్డ్ కప్లో ఆరు సార్లు పోటీపడగా మన అమ్మాయిలు నాలుగు సార్లు విజయం సాధించి, రెండింట్లో ఓటమి చవిచూశారు.

అయితే ఈ మ్యాచ్లో భారత్ కేవలం గెలిస్తే సరిపోదు, భారీ విజయంతో నెట్రన్రేటును మెరుగుపర్చుకోవాలి. న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడంతో భారత్... గ్రూప్-ఏ టేబుల్లో -2.900 నెట్ రన్రేటుతో అట్టడుగు స్థానంలో పడిపోయింది. కాగా, ఈ డూ ఆర్ డై మ్యాచ్లో టాస్ అదృష్టం భారత్కు దక్కలేదు. పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకోవాలని భావించామని తెలిపింది. జట్టులో ఓ మార్పు చోటు చేసుకుందని, గాయం కారణంగా పూజ జట్టుకు దూరమైందని పేర్కొంది. సానుకూల దృక్పథంలో ముందుకు సాగుతామని, గొప్పగా పంజుకోవడానికి ప్రయత్నిస్తామని హర్మన్ప్రీత్ కౌర్ వెల్లడించింది.
తుది జట్లు
భారత్: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, హర్మన్ప్రీత్ (కెప్టెన్), జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ, శ్రేయాంక, అరుంధతి, సజన, రేణుక, ఆశ.
పాకిస్థాన్: గుల్ ఫెరోజా, మునీబా, సిద్రా, నిదా, అలియా, ఒమైమా, ఫాతిమా (కెప్టెన్), సాదియా, నష్రా, ట్యూబా, అరూబ్.