భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ను స్టేడియంలో వీక్షిండానికి టికెట్ల కోసం తీవ్రంగా పోటీపడుతుంటారు. ఇక నేరుగా చూడటానికి సాధ్యం కానీ అభిమానులంతా లైవ్ మ్యాచ్ చూస్తూ టీవీలు, ఫోనులకు అతుక్కుపోతుంటారు. భారత్-పాక్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ను ఐసీసీ కూడా క్యాష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ లేదా వన్డే వరల్డ్ కప్.. ఏదైనా సరే, ఒకే గ్రూప్లో భారత్, పాక్ ఉండాలే ఐసీసీ ప్లాన్ చేస్తుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లోనూ ఇండియా, పాకిస్థాన్ గ్రూప్-ఏలోనే ఉన్నాయి. జూన్ 9న జరగనున్న ఈ మ్యాచ్కు స్టేడియంలో డైమండ్ క్లబ్ విభాగంలోని ఒక్కో సీటు టికెట్ ధరను 20 వేల అమెరికా డాలర్లకు విక్రయిస్తున్నారు. అంటే సుమారు రూ.16.65 లక్షలు అన్నమాట.

ఇక విజయం కోసంభారత్-పాకిస్థాన్ ఆటగాళ్లు చేసే పోరాటం మైదానంలో ఓ యుద్ధాన్ని తలపిస్తుంటుంది. అందుకే ప్రపంచకప్ ఫైనల్ కంటే భారత్-పాక్ లీగ్ మ్యాచ్కే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అయితే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆటగాళ్లపై అంచనాలు భారీగా పెరుగుతాయని, అదే కాస్త భయాన్ని కలిగిస్తుందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ పేర్కొన్నాడు. అయితే ఈ భయాందోళనలు ఎదుర్కోవడం కష్టమేమి కాదని, ఆటలో బేసిక్స్పై దృష్టిపెడితే సరిపోతుందని అన్నాడు.
''ఇతర మ్యాచ్ల కంటే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించే ఎక్కువ చర్చ సాగుతుందని మాకు తెలుసు. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్లినా, తమ దేశానికి మద్దతు ఇస్తూ భారత్-పాక్ పోరు గురించి మాట్లాడుకునే వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. ప్రతి క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటాడు. దీనిపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటాడు. అయితే మ్యాచ్పై ఉన్న అంచనాలు, హైప్ కొంత భయాన్ని కలిగిస్తాయి''
''ఒత్తిడిని ఎలా జయిస్తారనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. బేసిక్స్ ఎక్కువ దృష్టిసారిస్తే ఆటగాళ్లకు ఎంతో సులభం అవుతుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే విపరీతమైన ఒత్తిడితో కూడిన గేమ్. ఈ మ్యాచ్లో ప్రశాంతంగా ఉంటూ, కష్టాన్ని నమ్ముకుంటూ, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈజీగా ఉంటుంది'' అని బాబర్ అజామ్ అన్నాడు. 2021 టీ20 వరల్డ్ కప్లో భారత్పై పాకిస్థాన్ విజయం సాధించింది. వరల్డ్ కప్లో టీమిండియాపై పాక్ సాధించిన ఏకైక విజయం ఇదే. కాగా, గత టీ20 వరల్డ్ కప్-2022, వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియానే విజయఢంకా మోగించింది.