టీ20 వరల్డ్ కప్-2024లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు కుప్పకూలింది. మందకొడి పిచ్పై బ్యాటింగ్కు అంత గొప్పగా అనుకూలించకపోయినా 10 ఓవర్లకు టీమిండియా 81/3తో మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ ఆ తర్వాత తొమ్మిది ఓవర్లలో 38 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది.
రిషభ్ పంత్ (42; 31 బంతుల్లో, 6 ఫోర్లు), అక్షర్ పటేల్ (20; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) మాత్రమే స్తతాచాటారు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. పంత్ కూడా ఆదిలోనే ఔటవ్వాల్సింది. కానీ పంత్కు ఇవాళ అదృష్టం విపరీతంగా కలిసొచ్చింది. దాదాపు అయిదు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ భారీ స్కోరు సాధించలేకపోయాడు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా (3/21), హారిస్ రవూఫ్ (3/21) చెరో మూడు వికెట్లు, మహ్మద్ అమీర్ (2/23) రెండు వికెట్లతో సత్తాచాటారు.

అయితే భారత బ్యాటింగ్కు మూలస్తంభాల అయిన విరాట్ కోహ్లి (4; 3 బంతుల్లో, 1 ఫోర్), రోహిత్ శర్మ (13; 12 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఆదిలోనే ఔటవ్వడమే జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. ఒత్తిడితో కూడిన మ్యాచ్లో విరాట్ కోహ్లి-రోహిత్ శర్మలో ఒకరైనా ఓ ఎండ్లో నిలబడాల్సింది. కానీ కోహ్లి ఐపీఎల్ జోరులో బౌండరీకి యత్నించి ఫీల్డర్కు నేరుగా క్యాచ్ ఇచ్చాడు. కోహ్లి ఔటైన తర్వాత రోహిత్ అయినా భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది.
కానీ తన ట్రేడ్ మార్క్ షాట్తో సిక్స్ కొట్టాలని భావించి బంతిని గాల్లోకి లేపి సునాయాసంగా పెవిలియన్కు చేరాడు. మూడు ఓవర్లలోపే సీనియర్లు డగౌట్లో కూర్చోవడంతో ఒత్తిడి అంతా యువ క్రికెటర్లపై పడింది. పంత్-అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించినా బలమైన పాకిస్థాన్ బౌలింగ్ దళం ముందు ఎక్కువసేపు నిలబడలేకపోయారు. ఇక సూర్యకుమార్ (7; 8 బంతుల్లో, 1 ఫోర్), శివమ్ దూబె (3; 9 బంతుల్లో) ఒత్తిడికి చిత్తయ్యారు.
పిచ్ను అర్థం చేసుకునే క్రమంలోనే దూబె నసీమ్ షాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పాకిస్థాన్పై సూర్య తన పేలవమైన ఫామ్ను కొనసాగించాడు. ఇక రవీంద్ర జడేజా గోల్డెన్ డకౌట్గా పెవిలియన్కు వెళ్లాడు. కష్టాల్లో నిలిచిన జట్టును ఆదుకోవడానికి హార్దిక్ పాండ్య (7; 12 బంతుల్లో, 1 ఫోర్) ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్కోరుబోర్డును ముందుకు నడిపించాలనే తొందరలో ఔటయ్యాడు.