
సొంత మైదానం:
శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరగడంతో పాకిస్థాన్లో క్రికెట్ ఆడేందుకు ఇతర దేశాలు ఒప్పుకోవడం లేదు. దాంతో యూఏఈని పాక్ తమ సొంత మైదానంలా చేసుకుని మ్యాచ్లు ఆడుతోంది. పాకిస్తాన్కు వెళ్లాల్సిన జట్లు అన్ని యూఏఈలో మ్యాచులు ఆడుతున్నాయి. దీంతో అక్కడి పిచ్లపై పాకిస్థాన్ జట్టుకు ఉన్నంత అవగాహన మరే జట్టుకు లేదనే చెప్పాలి. ముఖ్యంగా టీమిండియా మరికొద్ది సేపట్లో తలపడనున్న దుబాయ్ మైదానంలో పాక్ జట్టుకు మంచి రికార్డు ఉంది. 2016 నుంచి ఇప్పటివరకూ దుబాయ్ మైదానంలో పాకిస్తాన్ జట్టు ఆడిన ఆరు టీ20ల్లోనూ గెలవడం విశేషం.

దుబాయ్ పాక్కు కొట్టిన పిండి:
దుబాయ్ పిచ్లు ఎలా ప్రవర్తిస్తాయో.. వాటిపై ఎలా బ్యాటింగ్ చేయాలో పాక్ ఆటగాళ్లకు బాగా తెలుసు. నిజం చెప్పాలంటే దుబాయ్ వాళ్లకు కొట్టిన పిండి. అయితే టీమిండియా ఆటగాళ్లు గతేడాది పూర్తి ఐపీఎల్ ఆడటంతో పాటు ఈసారి రెండో దశ పోటీలు కూడా యూఏఈలోనే ఆడడంతో ఆయా పిచ్లు అలవాటు అయినట్లే కనిపిస్తున్నాయి. కానీ పాకిస్థాన్కు రెండో సొంతగడ్డ లాంటి ఈ వేదికపై దాన్ని ఓడించాలంటే కోహ్లీసేన అందుకు తగిన వ్యూహాలు రచించాలి. ఏదేమైనా దుబాయ్ మైదానంపై పాక్ జట్టుకే ఎక్కువ అవగాహన ఉందనే విషయాన్ని మనం ఒప్పుకుని తీరాల్సిందే.

అగ్ర స్థానంలో బాబర్:
ఇప్పటివరకూ భారత్, పాకిస్థాన్ 8 టీ20ల్లో తలపడ్డాయి. భారత్ ఏడు మ్యాచ్ల్లో నెగ్గగా.. పాక్ ఒక విజయం మాత్రమే సాధించింది. గత మూడేళ్లలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ (1173) అగ్ర స్థానంలో ఉన్నాడు. భారత సారథి విరాట్ కోహ్లీ 993 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ల్లో పాక్తో ఆడిన మూడు ఇన్నింగ్స్ల్లోనూ విరాట్ అజేయంగా నిలిచాడు. 2012లో 78, 2014లో 36, 2016లో 55 పరుగులు చేసి.. ఒక్కసారి కూడా ఔట్ కాలేదు. టీ20 ప్రపంచకప్ల్లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు ఐదు. అన్నింట్లోనూ టీమిండియానే గెలిచింది. టీ20 ప్రపంచకప్ల్లో పాక్పై భారత్ నమోదు చేసిన అత్యధిక స్కోర్ 157/5. 2007 ఫైనల్లో భారత్ ఈ స్కోర్ సాధించింది.

మహీ టీమిండియాకు కలిసొచ్చే అంశమే:
వన్డే ప్రపంచకప్లో భారత్, పాక్ మధ్య ఏడు మ్యాచ్లు జరుగగా.. అందులోనూ భారత్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన నేపథ్యంలో పాకిస్థాన్ అండర్డాగ్గా మైదానంలో అడుగుపెట్టనుంది. టీ20 ప్రపంచకప్లో పాక్పై ఐదుసార్లు గెలిచిన భారత జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుత జట్టుకు మెంటార్గా వ్యవహరిస్తుండటం మన జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే కీలక పోరుకు ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. మరి సంప్రదాయం కొనసాగుతుందా.. లేక సంచలనం నమోదవుతుందా మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇటీవల దుబాయ్లో జరిగిన మ్యాచ్ల్లో బ్యాటింగ్ మెరుపుల కన్నా.. బౌలింగ్ ప్రదర్శనలే ఎక్కువ నమోదవుతున్నాయి. ఇంగ్లండ్, వెస్టిండీస్ పోరులోనూ ఇదే రుజువైంది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపొచ్చు. స్లో పిచ్పై స్పిన్నర్లు కీలకం కానున్నారు.


Click it and Unblock the Notifications












