
హెడ్ టు హెడ్ రికార్డ్స్
టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు ఆదివారం రాత్రి 7.30 గంటలకి దుబాయ్ వేదికగా తలపడబోతున్నాయి. టోర్నీలో రెండు జట్లకీ ఇదే మొదటి మ్యాచ్ కాగా.. గెలుపుతో కప్ వేటని ప్రారంభించాలని దాయాది జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్స్టార్ యాప్లోనూ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడోచ్చు. దుబాయ్ మైదానంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది.
2007 నుంచి టీ20 ప్రపంచకప్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. ఈ ఐదింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ టీ20 ప్రపంచకప్లోనే కాదు.. వన్డే ప్రపంచకప్లోనూ ఇప్పటి వరకూ భారత్ని కనీసం ఒక్కసారి కూడా పాకిస్థాన్ ఓడించలేకపోయింది. మొత్తంగా ప్రపంచకప్లో పాక్పై 12-0తో అజేయ రికార్డ్ని టీమిండియా కొనసాగిస్తోంది.

పిచ్ రిపోర్ట్
మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. టీమిండియా ఏకంగా ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్లో మాత్రమే పాక్ గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ని ఓడించే భారత్ విజేతగా అవతరించింది. భారత్తో ఈరోజు తలపడే జట్టుని పాకిస్థాన్ శనివారమే ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 12 మందితో కూడిన పాక్ జట్టులో ఒక్కరు మాత్రమే రిజర్వ్ బెంచ్పైకి వెళ్లనున్నారు.
ఆ ఒక్కరు ఎవరనేది టాస్ సమయంలో తేలనుంది. ఇటీవల దుబాయ్లో జరిగిన మ్యాచ్ల్లో బ్యాటింగ్ కన్నా.. బౌలింగ్ ప్రదర్శనలే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇంగ్లండ్, వెస్టిండీస్ మ్యాచులోనూ ఇదే జరిగింది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపొచ్చు. స్లో పిచ్పై స్పిన్నర్లు కీలకం కానున్నారు. భారత్ ముగ్గురు స్పిన్నర్లను బరిలో దించిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

తుది జట్టు ఎంపికపై ఆసక్తి
ఎప్పటిలానే ఈసారి కూడా భారత్ పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూస్తే జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. అయితే తుది జట్టు ఎంపిక ఆసక్తి రేకెత్తిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కీలకం కానున్నారు.
బౌలింగ్ వేయలేకపోతున్న హార్దిక్ పాండ్యాను కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్గానే ఆడిస్తారా? లేక రెండు విధాలా ఉపయోగపడే శార్దూల్ ఠాకూర్ జట్టులోకి తీసుకుంటారా? అన్నది ఆసక్తికరం. ఇక రవీంద్ర జడేజాతో కలిసి ఆర్ అశ్విన్ స్పిన్ భారాన్ని పంచుకోవచ్చు. ఒకవేళ అశ్విన్ వద్దనుకుంటే వరుణ్ చక్రవర్తి, రాహుల్ చహర్ల్లో ఒకరికి అవకాశం దక్కుతుంది.

వారి నుంచి భారత్కు ముప్పే
మరోవైపు పాకిస్తాన్ కూడా బలంగా ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్లో కెప్టెన్ బాబర్ అజామ్, ఓపెనర్ ఫకార్ జమాన్ల నుంచి భారత్కు ముప్పు పొంచి ఉంది. అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న బాబర్ను ఎంత త్వరగా పెవిలియన్కు చేరిస్తే అంత మంచిది. అతను కుదురుకుంటే టీమిండియాకు ఇబ్బందులు తప్పవు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న రిజ్వాన్ (33 మ్యాచ్ల్లో 1462 పరుగులు)ను వీలైనంత త్వరగా ఔట్ చేయాల్సిందే.
సీనియర్లు షోయబ్ మాలిక్, మొహ్మద్ హఫీజ్లను కట్టడిచేయాలి. గత రెండేళ్లలో ప్రపంచ స్థాయి పేసర్గా ఎదిగిన షహీన్ షా అఫ్రిదితో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. హసన్ అలీ, హారిస్ రవూఫ్ లాంటి ప్రతిభావంతులైన పేసర్లు పాక్ సొంతం. స్పిన్నర్లు ఇమాద్, షాదాబ్లు ఫామ్లో ఉన్నారు.

తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి/శార్దూల్ ఠాకూర్, ఆర్ అశ్విన్/భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ.
పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీమ్, షదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హారీస్ రౌప్/హైదర్ అలీ.

డ్రీమ్ 11 టీమ్:
లోకేష్ రాహుల్ (కెప్టెన్), బాబర్ అజమ్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, ఫఖర్ జమాన్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ రిజ్వాన్ (కీపర్) రవీంద్ర జడేజా, మహ్మద్ హఫీజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, హసన్ అలీ.


Click it and Unblock the Notifications












