
దుబాయ్: క్రికెట్ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టోర్నీలో రెండు జట్లకీ ఇదే మొదటి మ్యాచ్. ఈ నేపథ్యంలో గెలుపుతో మెగా కప్ వేటని ప్రారంభించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే విశ్వవేదికపై దాయాది జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా.. సేమ్ సీన్ రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నది. మరోవైపు ఎలాగైనా ఈసారి టీమిండియాను ఓడించాలనే లక్ష్యంతో పాక్ బరిలోకి దిగుతోంది.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో పలువురు మాజీలు తమ తమ తుది జట్లను ప్రకటించారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, ప్రముఖ వ్యాఖ్యాత దినేష్ కార్తీక్ తన భారత జట్టును ప్రకటించాడు. స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ మంచి రిథమ్లో ఉన్నాడని, అతడిని ఖచ్చితంగా జట్టులోకి తీసుకోవాలన్నాడు. ఓ స్పోర్ట్స్ వెబ్ సైట్తో మాట్లాడుతూ ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో కూడా ఠాకూర్ ఆకట్టుకున్నాడని చెప్పాడు. కార్తీక్ తన ప్లేయింగ్ ఎలెవన్లో రెండు ఆశ్చర్యకరమైన పేర్లను జోడించాడు. మొహ్మద్ షమీ బదులుగా భువనేశ్వర్ కుమార్ జట్టులో ఉండాలని చెప్పాడు.
'శార్దూల్ ఠాకూర్ గొప్ప రిథమ్లో ఉన్నాడు. అతనికి కీలక వికెట్లు తీయడంలో మంచి నైపుణ్యం ఉంది. కాబట్టి నేను ఇలాంటి కీలకమైన మ్యాచ్లో శార్దూల్ను కచ్చితంగా తీసుకుంటాను. ఐపీఎల్ 2021 ఫైనల్లో కూడా అతడు బాగా బౌలింగ్ చేశాడు. మ్యాచ్ను మలుపుతిప్పే కీలక వికెట్లు పడగొట్టాడు. అతడికి తుది జట్టులో చోటివ్వాల్సిందే. శార్దూల్ ఆత్మవిశ్వాసం కలిగిన ఆటగాడు. ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. ఒకవేళ ఈరోజు శార్దూల్ మ్యాచ్ ఆడితే బాగా రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ప్రముఖ వ్యాఖ్యాత దినేష్ కార్తీక్ ఓ స్పోర్ట్స్ వెబ్ సైట్తో అన్నాడు.
కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. నిజం చెప్పాలంటే శార్దూల్ ఠాకూర్ వలనే ఫైనల్లో కోల్కతా ఓటమిపాలైంది. ఫైనల్లో శార్దూల్ కీలక సమయంలో అద్భుత ప్రదర్శన చేశాడు. 3/38తో చక్కని ప్రతిభ కనబరిచాడు. వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి లాంటి కీలక వికెట్లు తీసి చెన్నైని విజయపథంలో నడిపించాడు. శార్దూల్ వల్లే తాము మ్యాచ్ గెలిచాం అని చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా అన్నాడు. ఫైనల్లో శార్దూల్ కాన్ఫిడెన్స్ ప్లేయర్గా కనిపించాడని, ప్రణాళిక ప్రకారం వికెట్లు పడగొట్టాడని పేర్కొన్నాడు.
దినేష్ కార్తీక్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జాడేజా, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్/ మొహ్మద్ షమీ.