IND vs PAK: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు.. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. చిరకాల ప్రత్యర్థుల జరిగే పోరు ఎప్పుడూ ఉత్కంఠగా ఉంటుంది. ఆసియా కప్ 2025 సూపర్-4లో ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్కు ముందు భారత మాజీ వికెట్ కీపర్ దీప్దాస్ గుప్తా టీమిండియాను హెచ్చరించారు. భారత జట్టు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాకిస్తాన్ జట్టు ప్రస్తుత ఫామ్ అంతగా లేకపోయినా.. వారిని తక్కువ అంచనా వేయడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనే నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.
పాకిస్థాన్ జట్టు ఎప్పుడూ ప్రమాదకరమే..
పాకిస్తాన్ జట్టు గత కొన్నేళ్లుగా ఒక యూనిట్గా అద్భుతమైన ప్రదర్శన చేయలేకపోయినా.. వారి జట్టులో వ్యక్తిగతంగా మ్యాచ్ గెలవగల ఆటగాళ్లు ఉన్నారని అన్నారు. పాకిస్తాన్ బౌలింగ్ విభాగం ఎప్పుడూ బలంగా ఉంటుందని, ఈసారి కూడా భారత బ్యాటర్లకు వారు తీవ్రమైన సవాళ్లను విసరగలరని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ బ్యాటింగ్ వారి బలహీనత అయినప్పటికీ, ఎప్పుడైనా అనూహ్యంగా రాణించగల సత్తా వారికి ఉందని, అందుకే వారిని తక్కువ అంచనా వేస్తే అది ఏ జట్టుకైనా ప్రమాదకరమని దాస్గుప్తా పేర్కొన్నారు.

అసలైన సవాల్ ఇప్పుడే మొదలైంది..
ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు భారత జట్టు చాలా బలంగా కనిపించిందని దీప్దాస్ గుప్తా పేర్కొన్నారు. గ్రూప్ దశలో భారత్ పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో ఓడించి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే సూపర్-4లో పోటీ మరింత కఠినంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. "భారత జట్టు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ఆడుతోంది. కానీ ఇప్పుడు సూపర్-4లో వారికి మరింత బలమైన పోటీ ఎదురవుతుంది. పాకిస్తాన్ ఈ మ్యాచ్ను కచ్చితంగా ఉత్కంఠభరితంగా మార్చగలదని నేను ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు.
స్పిన్ కాంబినేషన్కు మద్దతు
దుబాయ్ పిచ్లు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీమిండియా ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం కల్పించడం సరైన నిర్ణయమని దాస్గుప్తా సమర్థించారు. ముఖ్యంగా మణికట్టు స్పిన్నర్లు ఎప్పుడూ మ్యాచ్ విన్నర్లేనని ఆయన అన్నారు. "పరిస్థితులు మారినప్పుడు ఫింగర్ స్పిన్నర్ల ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది, కానీ రిస్ట్ స్పిన్నర్లు ఎలాంటి పిచ్పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సామర్థ్యం కలిగి ఉంటారు. కాబట్టి, ఈ స్పిన్ కాంబినేషన్ భారత్కు చాలా సరైనది, లాభదాయకం" అని ఆయన వివరించారు.
ఒత్తిడిలో పాకిస్తాన్.. టీమిండియాకు అప్రమత్తత అవసరం
భారత్, పాకిస్తాన్ల మధ్య సూపర్-4లో జరగనున్న ఈ మ్యాచ్ కేవలం పాయింట్ల పట్టిక కోసమే కాదు, మానసిక ఆధిపత్యం కోసం కూడా చాలా కీలకం. భారత జట్టు ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు అపజయం లేకుండా తమ బలాన్ని ప్రదర్శించగా, పాకిస్తాన్ ఈ మ్యాచ్ ద్వారా తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తోంది. దాస్గుప్తా హెచ్చరించినట్లుగా, భారత్ పాకిస్తాన్ను తక్కువ అంచనా వేస్తే, మ్యాచ్ ఫలితం ఊహించని విధంగా మారే అవకాశం ఉంది.